వైఎస్సార్ కడప జిల్లాలోని విద్యార్థులకు బ్యాడ్ న్యూస్. ఫిబ్రవరి 14వ తేదీ రెండో శనివారం సెలవు లేదు. పాఠశాలలు యధావిధిగా పనిచేయనున్నాయి. మొంథా తుఫాను సమయంలో జిల్లాలోని విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ఇచ్చారు. వీటికి బదులుగా రెండో శనివారం తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 14వ తేదీ స్కూళ్లు యథావిధిగా పనిచేయనున్నాయి. ఈ మేరకు అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

2025 అక్టోబర్ నెలలో ఏపీలో మొంథా తుఫాను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురవగా.. ముందస్తు జాగ్రత్తలలో భాగంగా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ కడప జిల్లా అధికారులు కూడా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 27,28,29వ తేదీలలో జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. అయితే విద్యార్థుల చదువును దృష్టిలో పెట్టుకుని.. ఈ సెలవు రోజులకు బదులుగా రెండో శనివారాల్లో పనిచేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలోనే నవంబర్ నెలలో వచ్చిన రెండో శనివారం (నవంబర్ 8), డిసెంబర్ నెల రెండో శనివారం (డిసెంబర్ 13) విద్యాసంస్థలు పనిచేశాయి. ఫిబ్రవరి రెండో శనివారం ( ఫిబ్రవరి 14) కూడా స్కూళ్లు పనిచేయనున్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు ఈ నిర్ణయం వర్తించనుంది. ఈ నేపథ్యంలో రేపు (ఫిబ్రవరి 14) యథావిధిగా కార్యకలాపాలు సాగించాలంటూ వైఎస్సార్ కడప జిల్లాలోని అన్ని పాఠశాలల హెడ్మాస్టర్లు, ప్రిన్సిపల్స్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.సాధారణంగా వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు జిల్లా కలెక్టర్.. సెలవుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇస్తుంటారు. అయితే విద్యా సంవత్సరంలో పనిదినాలు తగ్గకూడదనే ఉద్దేశంతో మిగతా సెలవు రోజులలో తరగతులు నిర్వహించి.. వీటిని భర్తీ చేస్తుంటారు.


