ప్రేమ పేరుతో బాలికను లొంగదీసుకున్న ఓ ఉపాధ్యాయుడికి విశాఖ పోక్సో కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. 2015లో ఈ ఘటన జరిగింది. అప్పట్లో బాలికతో కలిసి రాజస్థాన్ వెళ్లిపోయిన తిరుపతిరావును.. 2021లో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికి వీరికి ఇద్దరు పిల్లలు. ఈ కేసును విచారించిన పోక్సో న్యాయస్థానం నేరం రుజువు కావటంతో తిరుపతిరావుకు జైలు శిక్షతో పాటుగా 71 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పును ఇచ్చింది.

శ్రీకాకుళం జిల్లా, హిరమండలంలోని కొల్లివలసకు చెందిన తిరుపతిరావు.. చోడవరంలోని ఓ స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. తిరుపతిరావుకు అప్పటికే పెళ్లైంది. అయితే తాను పనిచేసే స్కూలు ఉండే ప్రాంతంలో ఓ ఎనిమిదో తరగతి బాలికతో తిరుపతిరావు పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో ఆమెను మభ్యపెట్టాడు. ఇంటి నుంచి 5 తులాల బంగారం, 50 వేలు నగదు తెప్పించేలా ఆమెను పురిగొల్పాడు. డబ్బూ, నగలు తీసుకుని రాగానే 2015 మే 25వ తేదీ.. అంటే సుమారుగా పదేళ్ల కిందట బాలికను తీసుకుని తిరుపతిరావు రాజస్థాన్ వెళ్లిపోయారు.
అయితే కూతురు కనిపించకపోవటంతో ఆ బాలిక తల్లిదండ్రులు కంగారుపడిపోయారు. చుట్టుపక్కల తెలిసిన ప్రాంతాలన్నీ గాలించారు. ఎక్కడా జాడ తెలియకపోవటంతో.. చివరకు చోడవరం పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ చోడవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే 2021లో తిరుపతిరావు, బాలిక రాజస్థాన్లో ఉన్నట్లు గుర్తి్ంచారు. రాజస్థాన్లో తిరుపతిరావును అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఆరేళ్లపాటు పోలీసులకు చిక్కకుండా రాజస్థాన్లో బాలికతో పాటు ఉండిపోయారు తిరుపతిరావు. ఈ క్రమంలోనే వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. తిరుపతిరావు, బాలిక, ఇద్దరు పిల్లలను 2021లో పోలీసులు విశాఖపట్నం తీసుకువచ్చారు. కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ కేసు పూర్వాపరాలు విచారించిన విశాఖపట్నం పోక్సో కోర్టు నేరం రుజువు కావటంతో తిరుపతిరావుకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 71 వేలు జరిమానా విధిస్తూ విశాఖ పోక్సో న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. జరిమానాలో రూ. 70 వేలు బాధితురాలికి పరిహారంగా అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు.


