భారత అటవీ శాఖ అధికారిణి స్వేత బొడ్డు పులుల వేట, వాటి సంరక్షణపై కీలక విషయాలను వెల్లడించారు. పులుల చర్మం కంటే వాటి ఎముకలకే అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ విలువ ఉందని ఆమె తెలిపారు. ముఖ్యంగా ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్(TCM) కోసం అడవి పులుల ఎముకలకు భారీ డిమాండ్ ఉందని, దీని వెనుక కోట్ల రూపాయల లావాదేవీలతో కూడిన వ్యవస్థ ఉందని.. అలాగే అంతర్జాతీయ నేర ముఠాలు కూడా ఉన్నాయని వివరించారు. ఈ ముఠాలు తక్కువ నిఘా ఉన్న అటవీ ప్రాంతాల్లో సుదీర్ఘ రెక్కీ చేసి, స్నేర్స్ వంటి సాంప్రదాయ పద్ధతులతో పులులను వేటాడతాయని, వృత్తిపరంగా డిస్కిన్ చేసి, ఎముకలను వేరు చేస్తాయని పేర్కొన్నారు. అడవుల్లో నెలల తరబడి మకాం వేసి, టార్పాలిన్ షీట్లతో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని, తమ కుటుంబాలతో సహా స్థిరపడతాయి ఈ ముఠాలు.
పత్తి పొలాల్లో పనిచేసేందుకు వచ్చినట్లు నమ్మించి, పులుల కదలికలు, అవి తిరిగే మార్గాలు, సమయాలపై పక్కా రెక్కీ చేస్తాయి. వారి మోసపూరిత పద్ధతుల్లో భాగంగా దేశీ జుగాడ్ స్నేర్లను ఉపయోగిస్తాయి. ఇవి రస్ట్ పట్టిన ఇనుప ముక్కల్లా కనిపించినా, పులి పాదం తగలగానే బలంగా పట్టుకుంటాయి. పులి కదలలేని స్థితికి చేరుకున్నాక, 8-10 మంది వేటగాళ్లు 5-10 గంటల పాటు శ్రమించి, పులిని సెమీ కాన్షియస్ స్థితికి తెచ్చి, వృత్తిపరంగా డిస్కిన్ చేసి, గోళ్లను, ఎముకలను వేరు చేస్తారు. మిగిలిన మాంసాన్ని పూడ్చిపెట్టడం లేదా కాల్చివేయడం ద్వారా అక్కడ ఎలాంటి ఆనవాళ్లూ లేకుండా చేస్తారు.
ఈ అక్రమ వ్యాపారంలో కీలకమైన అంశం ఏమిటంటే, పులి చర్మం కంటే దాని ఎముకలకే ఎక్కువ విలువ ఉండటం. చైనాలో పులుల చర్మం కోసం టైగర్ ఫామ్స్ ఉన్నప్పటికీ, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ (TCM)లో అడవి పులుల ఎముకలకు, ముఖ్యంగా వాటిలోని గుజ్జుకు ఆఫ్రోడీజియాక్, ఇతర ఔషధ గుణాలు ఉన్నాయనే అపోహల వల్ల భారీ డిమాండ్ ఉంది. ఇది కోట్ల రూపాయల విలువైన అంతర్జాతీయ వ్యాపారంగా కొనసాగుతోంది. ఓ కేసు దర్యాప్తులో భాగంగా షిల్లాంగ్లోని ఒక కోఆర్డినేటర్, మయన్మార్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక మహిళ, హవాలా ఏజెంట్లతో కూడిన పెద్ద నెట్వర్క్ను గుర్తించినట్లు తెలిపారు. ఈ ముఠాలు మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి లాంటి ప్రాంతాల్లో తమ కార్యకలాపాలను పంచుకుని నిర్వహించుకుంటాయి. కార్వా సఫారీ వంటి పర్యాటక కార్యక్రమాల వల్ల స్థానికులు అడవులను తమవిగా భావించి, పర్యావరణ వ్యవస్థను, పులులను కాపాడడంలో ముందుంటారని, ఇది పోచింగ్, పశువుల మేత వంటి సమస్యలను తగ్గించి, అటవీ శాఖకు ఉచితంగా సహకరిస్తుందని ఆమె పేర్కొన్నారు.

