మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో ఓ మహిళ చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ఆలయ క్యూలైన్లో వేచి ఉండి అస్వస్థతకు గురై మణెమ్మ అనే మహిళ చనిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై ఏపీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం స్పందించింది. అసలు ఏం జరిగిందనే దానిపై క్లారిటీ ఇచ్చింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనలో 108 సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం లేదని తెలిపింది.

“మహా శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలోని క్యూలైన్లో దర్శనం కోసం ఎక్కువ సేపు వేచి ఉండటంతో, ఒక మహిళ అస్వస్థతకు గురయ్యారని.. 108 సకాలంలో రాకపోవటంతో ఆ మహిళ చనిపోయారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి.. ఆలయ ప్రాంగణంలోని గాలిగోపురం వద్ద ఒక మహిళ అచేతనంగా పడిపోయి ఉన్నారని సమాచారం అందింది. దీంతో డ్యూటీ డాక్టర్ తక్షణమే అక్కడకు చేరుకుని ఆ మహిళకు సీపీఆర్ చేశారు. అయితే ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో 108లో మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో సత్వర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.” అని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం వెల్లడించింది.
చనిపోయిన మహిళను తిరుపతి జిల్లా చిట్టమూరుకు చెందిన కన్నెబోయిన మణెమ్మ w/o రాజేంద్రగా గుర్తించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి వైద్యుల నిర్లక్ష్యం, 108 సిబ్బంది నిర్లక్ష్యం లేదని ఏపీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం క్లారిటీ ఇచ్చింది. దేవాలయం వద్ద క్యూలైన్లో వేచి ఉండే సామాన్య భక్తులకు 30 నిమిషాలలోనే దర్శనం చేసుకొనే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించారని వివరించింది. భక్తులను భయభ్రాంతులకు గురిచేసేలా తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని.. అలాంటి వాటిని నమ్మవద్దని ఏపీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం విజ్ఞప్తి చేసింది. మరోవైపు శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. అభిషేకాలు, అర్చనలతో శివాలయాలకు భక్తుల తాకిడి పెరిగింది.

