ప్రజారోగ్యానికి పెను సవాల్ విసురుతున్న దోమలపై హైటెక్ యుద్ధానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దోమల నియంత్రణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు ఉపయోగించనుంది. ఏఐ ఆధారంగా పనిచేసే స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ ద్వారా దోమలను కట్టడి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ విధానాన్ని పరిశీలించనున్నారు. అక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా మరిన్ని నగరాలకు విస్తరించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. తిరుపతిలో ప్రైవేట్ సంస్థకు ఈ పనులు అప్పగించనున్నారు.

స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్.. ఎలా పనిచేస్తుందంటే..
స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్లో భాగంగా తొలుత ముందుగా నిర్ణయించిన కొన్ని ప్రాంతాలలో ఐవోటీ పరికరాలు (Internet of Things) ఏర్పాటు చేస్తారు. ఈ పరికరాలు ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటాయి. ఫిరమోన్ సాయంతో ఈ ప్రత్యేక వాసన వచ్చేలా అధికారులు వీటిని రూపొందించారు. దీంతో దోమలను ఇవి సులువుగా ఆకర్షిస్తాయి. దీని ద్వారా ఆ ప్రాంతంలో దోమల సాంద్రత ఎలా ఉంది.. అవి ఏ జాతి దోమలు, వాటి లింగం ఏంటనే వివరాలను ఈ ఐవోటీ పరికరాలు గుర్తిస్తాయి. ఈ సమాచారాన్ని వెంటనే సెంట్రల్ డ్యాష్ బోర్డుకు పంపిస్తుంది. ఈ డ్యాష్ బోర్డు.. ఏఐ సాయంతో ఈ వివరాలను విశ్లేషించి.. ఆ ప్రాంతంలో దోమల తీవ్రత ఎలా ఉందనే దానిపై అధికారులను అప్రమత్తం చేస్తుంది. ఆ తర్వాత దోమల నియంత్రణ కోసం డ్రోన్ల సాయంతో మందులను పిచికారీ చేసేలా ప్రణాళికలు రచించారు. మరోపతి తిరుపతిలో దోమలు అధికంగా ఉండే 250 హాట్స్పాట్లు గుర్తించారు. వీటిలోని కొన్ని ప్రాంతాలలో జాప్ ట్రాపులు, ఐవోటీ సెన్సార్లు ఏర్పాటు చేయనున్నారు. 20 లక్షలతో నాలుగుచోట్ల ఈ పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే తిరుపతిలో ఈ పనులను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించనున్నారు. ఈ నాలుగుచోట్ల వచ్చే ఫలితాల ఆధారంగా తిరుపతి మొత్తం ఈ సేవలు విస్తరించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఈ స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ను తిరుపతితో పాటుగా విశాఖ, విజయవాడ, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి ప్రాంతాల్లో అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.


