తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. మే నెలకు సంబంధించిన తిరుమల దర్శనం, వసతి గదుల కోటా విడుదల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఫిబ్రవరి 18న ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనుంది. రూ.300 ప్రత్యేక దర్శనం కోటాను ఫిబ్రవరి 24వ తేదీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా భక్తులు శ్రీవారి దర్శనం, వసతి గదులను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది.

ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం పదింటికి ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను టీటీడీ ఆన్ లైన్లో విడుదల చేయనుంది. ఇక మే నెలకు సంబంధించిన వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటాను 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల చేస్తారు. ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మే నెలకు సంబంధించిన టికెట్ల కోటాను ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.మరోవైపు శ్రీవారి భక్తుల కోసం తిరుమల, తిరుపతిలలో టీటీడీ గదులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. మే నెలకు సంబంధించిన గదుల కోటాను ఫిబ్రవరి 24వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు.
మరోవైపు ఫిబ్రవరి 27వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటాను టీటీడీ ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తుంది. మరోవైపు భక్తులు దళారులను ఆశ్రయించకుండా.. తమ అధికారిక వెబ్ సైట్ అయిన https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో కోరింది.


