అన్నమయ్య జిల్లా మదనపల్లె బాలిక హత్య కేసులో డీఐజీ కోయ ప్రవీణ్ కీలక వివరాలు వెల్లడించారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. అనంతరం విలేకర్లతో మాట్లాడిన కోయ ప్రవీణ్.. బాలికపై అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలిందన్నారు. నీటిలో ముంచడం వల్లనే చనిపోయినట్లు తెలిసిందని వివరించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని.. వీలైనంత త్వరగా పట్టుకుంటామన్నారు. కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మరోవైపు మదనపల్లె బాలిక కేసుపై సీఎం చంద్రబాబు కూడా స్పందించిన సంగతి తెలిసిందే. బాలిక తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు.. వారికి ధైర్యం చెప్పారు. కారకులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. హోం మంత్రి వంగలపూడి అనిత కూడా చిన్నారి తల్లిదండ్రులను ఫోన్లో పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని.. కారణమైన వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. న్యాయం చేస్తామని బాలిక కుటుంబానికి తెలిపారు.
కనిపించకుండాపోయిన బాలిక పొరుగింటి డ్రమ్ములో.. సైకో యువకుడు అలా ఎందుకు చేశాడు?
మహిళా మంత్రులు తీవ్ర ఆగ్రహం
మరోవైపు ఈ ఘటనపై మంత్రి సంధ్యారాణి కూడా స్పందించారు. ఇది సాధారణ నేరం కాదన్న మంత్రి సంధ్యారాణి.. చిన్నారిపై జరిగిన దాడి, సమాజ గౌరవంపై జరిగిన దాడి అని అన్నారు దోషులు ఎవరైనా, ఎంతటి వారైనా కఠిన శిక్ష అనుభవించక తప్పదని.. మహిళలు, బాలికల భద్రతపై రాజీ పడబోమని అన్నారు. మదనపల్లె బాలిక హత్య కేసులో సమాజానికి గట్టి సందేశం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. మరోవైపు ఏడేళ్ల బాలిక సోమవారం అదృశ్యం కాగా.. ఎదురుగా ఉండే కులవర్ధన్ అనే వ్యక్తి ఇంట్లో మృతదేహం గుర్తించారు. బాలికపై అత్యాచారం జరిగిందని.. ఆపై హత్య చేసినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు.


