గ్రామీణ ప్రజలకు భద్రమైన పొదుపు పథకాలు అందించడంలో ఇండియా పోస్ట్ కీలక పాత్ర పోషిస్తోంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పరిధిలో అమలు చేస్తున్న గ్రామ్ సురక్ష యోచన గ్రామాల్లో విస్తృతంగా ఆదరణ పొందిన పథకం. 1995లో ప్రారంభమైన ఈ పథకం ప్రధానంగా పేదలు, మహిళలు, గ్రామీణ వర్గాలకు జీవన భద్రత కల్పించడం, బీమా అవగాహన పెంచడం లక్ష్యంగా పనిచేస్తోంది.
రోజుకు కేవలం రూ.50 పెట్టుబడితో ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. అంటే నెలకు సుమారు రూ.1,500 చెల్లించవచ్చు. దీర్ఘకాలికంగా కొనసాగిస్తే 55 ఏళ్ల వయస్సులో సుమారు రూ.31.6 లక్షలు, 58 ఏళ్లకు రూ.33.4 లక్షలు, 60 ఏళ్లకు రూ.34.6 లక్షల వరకు మెచ్యూరిటీ మొత్తం పొందే అవకాశం ఉంది.
ఈ పథకం 80 సంవత్సరాల వయస్సు వరకు రక్షణ కల్పించేలా రూపొందించబడింది. 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఇందులో చేరవచ్చు. కనీస బీమా మొత్తం రూ.10,000 కాగా, గరిష్ట పరిమితి రూ.10 లక్షలు. ప్రీమియం చెల్లింపును నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక లేదా వార్షిక పద్ధతుల్లో ఎంచుకోవచ్చు.
ఈ పథకంలో 4 సంవత్సరాల తర్వాత రుణ సౌకర్యం లభిస్తుంది. 5 సంవత్సరాల తర్వాత బోనస్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే గడువు పూర్తికాకముందే పాలసీ రద్దు చేస్తే బోనస్ వర్తించదు.
మూడు సంవత్సరాల తర్వాత సరెండర్ సౌకర్యం ఉంటుంది. మొత్తంగా చూస్తే, గ్రామ సురక్ష యోజన గ్రామీణ కుటుంబాలకు భవిష్యత్ ఆర్థిక భద్రతను అందించే నమ్మకమైన పొదుపు పథకంగా నిలుస్తోంది.





