Smriti Mandhana : టీ20 ప్రపంచకప్ 2026 సందడి మధ్య భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్(BBC ISWOTY) అవార్డు ఆమెను వరించింది. సోమవారం (ఫిబ్రవరి 16) న్యూఢిల్లీలో జరిగిన అట్టహాసమైన వేడుకలో ఈ అవార్డును ప్రకటించారు. ప్రస్తుతం స్మృతి మంధాన భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నందున, ఆమె తరపున ఆమె తల్లి స్మిత మంధాన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
స్మృతి మంధానకు 2025 సంవత్సరం ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పవచ్చు. ఆమె ఈ ఏడాదిలో సాధించిన విజయాలు అమోఘం.
మహిళల ప్రపంచకప్ విజేత: 2025లో భారత్ వేదికగా జరిగిన ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్లో భారత్ చారిత్రక విజయం సాధించడంలో వైస్ కెప్టెన్ అయిన స్మృతి కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నీలో ఆమె మొత్తం 434 పరుగులు సాధించి టాప్ స్కోరర్లలో ఒకరిగా నిలిచారు.
WPL టైటిల్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తూ, వరుసగా రెండోసారి మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ను అందించి తన నాయకత్వ పటిమను చాటారు.
రికార్డుల వర్షం: ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు (1,703 అంతర్జాతీయ పరుగులు) చేసిన మహిళా క్రికెటర్గా సరికొత్త రికార్డు సృష్టించారు. అలాగే ఆస్ట్రేలియాపై కేవలం 50 బంతుల్లోనే సెంచరీ బాది విరాట్ కోహ్లీ రికార్డును కూడా అధిగమించారు.
ఈ అవార్డు కోసం స్మృతితో పాటు భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, చెస్ గ్రాండ్ మాస్టర్ దివ్య దేశ్ముఖ్, హర్డలర్ జ్యోతి యర్రాజీ, షూటర్ సురుచి సింగ్ పోటీ పడ్డారు. టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, పారాలింపిక్ ఛాంపియన్ దీపా మాలిక్, అథ్లెటిక్స్ ఐకాన్ అంజు బాబీ జార్జ్ వంటి దిగ్గజాలతో కూడిన జ్యూరీ ప్యానెల్ స్మృతిని విజేతగా ఎంపిక చేసింది. తన గ్రేస్, స్థిరత్వం, ఒత్తిడిలో రాణించే సామర్థ్యం ఆమెను ఈ అవార్డుకు అర్హురాలిని చేశాయని జ్యూరీ ప్రశంసించింది.
ఇతర ప్రధాన అవార్డులు
ఈ వేడుకలో స్మృతితో పాటు మరికొందరు క్రీడాకారిణులకు కూడా గౌరవం దక్కింది.
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: దివ్య దేశ్ముఖ్ (చెస్)
పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్: ప్రీతి పాల్ (అథ్లెటిక్స్)
లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు: అంజలి భాగవత్ (షూటింగ్)
స్టార్ పెర్ఫార్మర్: భారత మహిళా క్రికెట్ జట్టు (వరల్డ్ కప్ విజయం కోసం).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

