తల్లిదండ్రులు తమ గొడవల్లో మునిగిపోయి, పక్కనే ఉన్న పసిపిల్లల కళ్లలో కనిపిస్తున్న భయాన్ని గమనించలేకపోతున్నారు. ఈ నిరంతర ఘర్షణలు పిల్లల మనసుపై ఎంతటి లోతైన గాయాలు చేస్తాయో తెలుసుకుందాం..
- చిన్న పిల్లలు తమ తల్లిదండ్రుల మీద పూర్తిగా ఆధారపడి ఉంటారు. ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుంటే వారు అభద్రతా భావానికి లోనవుతారు. తమకు రక్షణగా ఉండాల్సిన వారే ఇలా కొట్టుకుంటుంటే, తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వారిని వేధిస్తుంది. దీనివల్ల వారు భయస్తులుగా మారిపోతారు లేదా ప్రవర్తనా పరమైన సమస్యలను ఎదుర్కొంటారు.
- పిల్లలకు ఉన్న మరో లక్షణం ఏంటంటే.. తల్లిదండ్రుల మధ్య గొడవ జరిగితే అది తమ వల్లే జరిగిందని వారు భావిస్తారు. ఆ సమస్యతో తమకు సంబంధం లేకపోయినా, లోలోపల ఒక విధమైన అపరాధ భావం పెంచుకుంటారు. ఇది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. తమ వల్ల అమ్మనాన్నలు బాధపడుతున్నారనే భావన వారిని కుంగదీస్తుంది.
- పిల్లలు తమ తల్లిదండ్రులను చూసే అన్నీ నేర్చుకుంటారు. ఏదైనా విభేదం వచ్చినప్పుడు అరిచి సాధించుకోవాలని లేదా కోపంగా ప్రవర్తించాలని వారు తల్లిదండ్రుల నుంచే గ్రహిస్తారు. దీనివల్ల వారు బయట స్నేహితులతో లేదా తోటివారితో కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించుకోవాలనే కనీస జ్ఞానాన్ని వారు కోల్పోయే ప్రమాదం ఉంది.
- నిరంతర మానసిక ఒత్తిడి వల్ల పిల్లల్లో ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది కేవలం మనసుకే కాదు, శరీరానికి కూడా హాని చేస్తుంది. తరచుగా తలనొప్పి రావడం, కడుపులో ఇబ్బంది, నిద్రలేమి వంటి సమస్యలు వారిని వేధిస్తాయి. ఈ ఒత్తిడి ప్రభావం చదువుపై కూడా పడుతుంది. పాఠశాలలో ఏకాగ్రత దెబ్బతిని మార్కులు తగ్గిపోయే అవకాశం ఉంది.
- తరచుగా గొడవపడే తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఉండాల్సిన అనుబంధం బలహీనపడుతుంది. పిల్లలు తమ తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడటానికి భయపడతారు. వారి మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యం, నమ్మకం తగ్గిపోయి పిల్లలు మానసికంగా దూరమైపోతారు.విభేదాలు వచ్చినప్పుడు పిల్లల ముందు కాకుండా ఏకాంతంగా చర్చించుకోవడం మంచిది. పిల్లల సమక్షంలో ఎప్పుడూ గౌరవప్రదంగా సంభాషించాలి. ఒకవేళ గొడవ జరిగినా, పిల్లలకు తాము సురక్షితమని, తమను ప్రేమిస్తున్నామని భరోసా ఇవ్వాలి. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తిపాస్తుల కంటే ప్రశాంతమైన వాతావరణం చాలా ముఖ్యం. మీ గొడవలు వారి బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది.

