ప్రతి ఒక్కరికీ కోటీశ్వరులు కావాలని, విలాసవంతమైన జీవితాన్ని గడపాలని ఉంటుంది. కానీ, కేవలం సంపాదనతోనే అది సాధ్యం కాదు. తెలివైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి మాత్రమే మిమ్మల్ని ఆర్థిక లక్ష్యాల వైపు నడిపిస్తాయి. ముఖ్యంగా మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి తట్టుకుని నిలబడాలంటే దీర్ఘకాలిక పెట్టుబడులే సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం..
1. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) – వృద్ధాప్యానికి భరోసా!
కేంద్ర ప్రభుత్వం 2004లో ప్రారంభించిన ఈ పథకం రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనుకునే వారికి ఒక వరం. PFRDA పర్యవేక్షణలో నడిచే ఈ పథకంలో కేవలం వెయ్యి రూపాయలతో పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఇందులో ఏడాదికి 2 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు లభించడం విశేషం. మీ పిల్లల భవిష్యత్తు కోసం లేదా మీ వృద్ధాప్య అవసరాల కోసం ఇది అత్యంత సురక్షితమైన మార్గం.
2. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) – రిస్క్ లేని లాభం!
ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన ప్రత్యామ్నాయం కోసం చూసేవారికి PPF బెస్ట్ ఛాయిస్. ఇందులో రిస్క్ సున్నా శాతం.. అంటే మీ సొమ్ముకు వంద శాతం ప్రభుత్వ గ్యారెంటీ ఉంటుంది. ప్రస్తుతం 7.1% వడ్డీ లభిస్తోంది. ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం మెచ్యూరిటీ మొత్తంపై ఎలాంటి పన్ను కట్టాల్సిన పనిలేదు. కనీసం 500 రూపాయలతో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. అవసరమైతే ఈ ఖాతాపై రుణం తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
3. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు – భారీ లాభాల గని!
మీరు కొంచెం రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉండి, గరిష్ట లాభాలు ఆశిస్తుంటే మ్యూచువల్ ఫండ్లు సరైన వేదిక. సాధారణంగా ఇవి 12 నుంచి 15 శాతం వరకు రాబడిని అందిస్తాయి. ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లు మార్కెట్ను విశ్లేషించి మీ డబ్బును షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. ఇందులో సెక్టార్ ఫండ్స్, డైవర్సిఫైడ్ ఫండ్స్ వంటి రకాలు ఉన్నాయి. దీర్ఘకాలంలో సంపదను సృష్టించడానికి ఈక్విటీ ఫండ్లు ఎంతో తోడ్పడతాయి.
పెట్టుబడి పెట్టడం అంటే కేవలం డబ్బును దాచుకోవడం కాదు, ఆ డబ్బు మీ కోసం పని చేసేలా చూసుకోవడం. పైన పేర్కొన్న ఏ పథకాన్ని ఎంచుకున్నా, అది మీ అవసరాలు రిస్క్ తీసుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉండాలి.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

