ఆ పాము కనిపిస్తే అదృష్టం అని కొందరు.. కోట్లు కురిపిస్తుందని మరికొందరు.. దాన్ని చంపితే పాపం అని ఇంకొందరు.. ఇలా రకరకాల పుకార్లు, మూఢనమ్మకాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఎర్ర ఇసుక బోవా తాజాగా షాద్నగర్ పరిధిలో ప్రత్యక్షమైంది. అరుదైన ఈ రెండు తలల పాము జనావాసాల్లోకి రావడంతో స్థానికులు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని ఫరూఖ్ నగర్ ప్రాంతంలో జరుగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ స్థలంలో ఈ వింత పాము ప్రత్యక్షమైంది. అక్కడ పనిచేస్తున్న షఫీ అనే వ్యక్తికి వింతగా కనిపిస్తున్న ఈ పాము కంటపడింది. వెంటనే అప్రమత్తమైన ఆయన, ఇది అరుదైన జాతి పాము అని గుర్తించి ఫలక్నుమా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే అటవీ శాఖ అధికారులను రంగంలోకి దించారు.
రెండు తలల పాము.. దీని స్పెషాలిటీ ఏంటీ?
సాధారణంగా దీనికి రెండు తలలు ఉండవు. కానీ దీని తోక కూడా తల లాగే మొద్దుబారి ఉండటంతో చూసేవారికి రెండు వైపులా తలలు ఉన్నట్టు భ్రమ కలిగిస్తుంది. అందుకే దీనికి రెండు తలల పాము అని పేరు వచ్చింది. ఇది చాలా నెమ్మదిగా కదులుతుంది. విషపూరితమైనది కాకపోయినప్పటికీ దీని రూపురేఖలు చూసి జనం భయపడతారు. ఈ పాముకు అంతర్జాతీయ మార్కెట్లో కోట్లాది రూపాయల విలువ ఉంటుందని, దీనితో చేసే క్షుద్రపూజలు ధనాన్ని కురిపిస్తాయని, అలాగే కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు మందుల తయారీలో వాడతారని ప్రచారం ఉంది. ఈ మూఢనమ్మకాలే ఈ పాము పాలిట శాపంగా మారాయి.
అరుదుగా కనిపించే ఈ పాములను పట్టుకుని స్మగ్లర్లు భారీ ధరలకు అమ్ముతుంటారు. ఇది అంతరించిపోతున్న జాతి కావడంతో దీన్ని వేటాడటం లేదా ఇంట్లో ఉంచుకోవడం చట్టరీత్యా నేరం. పోలీసుల సమాచారం మేరకు ఫరూఖ్ నగర్ చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది, ఎర్ర ఇసుక బోవాను సురక్షితంగా బంధించారు. దాన్ని పరీక్షించిన అనంతరం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. సకాలంలో సమాచారం అందించిన షఫీని అధికారులు అభినందించారు.

