కాణిపాకం ఆలయంలో అపచారం జరిగింది. అంతరాలయంలో ఫోటోలు తీయడం నిషేధం. అయితే ఇటీవల విదేశీ భక్తుల బృందం ఆలయాన్ని సందర్శించింది. ఈ బృందంలోని ఓ వ్యక్తి అంతరాలయంలో హారతి ఇస్తున్న సమయంలో ఫోటోలు తీశారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. దీనిపై భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తం కావటంతో తీసిన మహిళ క్షమాపణలు తెలిపారు. తెలియక చేశానని.. క్షమించాలని కోరారు. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించినట్లు చెప్పారు.

దీంతో ఈ వ్యవహారం కాస్తా ఆలయ అధికారుల వద్దకు చేరింది. ఈ విషయం మీద కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్ స్పందించారు. అంతరాలయంలో ఫోటో తీసిన వ్యక్తి ఎవరో గుర్తించి, చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఆలయంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతాపరమైన చర్యలు చేపడతామని తెలిపారు. అయితే భక్తులు, నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావటంతో.. తెలియకతీశాం, క్షమించండి అంటూ ఓ మహిళ శనివారం రోజు రాత్రి వీడియోను విడుదల చేశారు. విశ్వనాథ గురూజీ శిష్యురాలు అయిన రిషికా అభిరామి అనే మహిళ అంతరాలయంలో తెలియక ఫోటోలు తీశామని.. క్షమించాలని కోరారు. ఫోటోలు తీయకూడదని తమకు తెలియదని.. పొరపాటు జరిగిందన్నారు. సోషల్ మీడియా నుంచి కూడా ఆ ఫోటోలు, వీడియోలు తీసేశామని చెప్పుకొచ్చారు.
మరోవైపు గతంలోనూ కాణిపాకం ఆలయంలో ఓ అపచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కాణిపాకం వినాయకుడికి విరిగిన పాలతో అభిషేకం చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ ఘటన సంచలనం రేపగా.. అధికారులు స్పందించారు. ఇదంతా పూర్తిగా తప్పుడు ప్రచారమని క్లారిటీ ఇచ్చారు. అభిషేకం కోసం పాలను టెండరుదారు నుంచి భక్తులే ఆలయంలోకి తీసుకువస్తారని వివరించారు. అలివేల మండపంలో తీసుకుని.. అంతరాలయంలోకి తీసుకవస్తారని అన్నారు. అయితే టెండరుదారుడికి, భక్తుడికి మధ్య బయట గొడవ జరిగితే దానిని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అప్పట్లో క్లారిటీ ఇచ్చారు.


