ఉన్నత చదువుల కోసం విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టిన విద్యార్థులు కోడికూర కోసం కొట్టుకున్న సంఘటన వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో జరిగింది. విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ చిన్నపాటి యుద్ధాన్ని తలపించింది. రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు.. ఆ విద్యార్థుల పుర్రెలు పుచ్చకాయల్లా పగిలి పోయాయి.. విద్యార్థులు విచక్షణా రహితంగా కొట్టుకోవడం చర్చగా మారింది. పోలీసులు కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నారు.
ఈ ఘర్షణ కాకతీయ యూనివర్సిటీలోని కామన్ మెస్లో జరిగింది ఎంబీఏ, ఎకనామిక్స్, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల మధ్య కోడికూర చిచ్చు పెట్టింది. కొందరికి ఎక్కువ మరికొందరికి తక్కువ వడ్డిస్తున్నారని విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాట మాట పెరిగి భౌతికదాడుల వరకు దారితీసింది..
కామన్ మెస్ లో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి విచక్షణ రహితంగా కొట్టుకున్నారు కర్రలు రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు.. ఈ దాడుల్లో ఓ విద్యార్థికి తల పగిలి తీవ్ర రక్తస్రావం అవ్వగా అతని ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు విద్యార్థుల చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అంతకంటే ముందు రోజు బాయిల్డ్ ఎగ్స్ విషయంలో కూడా విద్యార్థుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.
ఘర్షణ పడ్డ విద్యార్థులంతా యూనివర్సిటీలోని న్యూ పీ.జీ హాస్టల్లో ఉంటున్న వారే.. ఆదివారం సాయంత్రం కామన్ మెస్లో చికెన్ విషయంలో ఘర్షణ చెలరేగడం తీవ్ర ఉదృతకు దారి తీసింది.. రాత్రి 11 గంటల వరకు క్యాంపస్ లో హై టెన్షన్ వాతావరణం కనిపించడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి అదుపు చేశారు.. ఈ గొడవకు కారణమైన ఐదుగురు విద్యార్థులపై కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయాయి.. సెక్షన్ 118(1), 351(2), r/w 3(5) BNS సెక్షన్లలో కేసులు నమోదు చేశారు..
ఉన్నత చదువుల కోసం కోటి ఆశలతో విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టిన ఈ పేద విద్యార్థులు ఇక్కడ ఇలా గ్రూపులుగా విడిపోయి తన్నుకోవడం తల్లిదండ్రులను తీవ్ర మనోవేధనకు గురిచేస్తుంది.. పరస్పర దాడుల్లో గాయపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.. కేసుల పాలైన విద్యార్థుల జీవితాలు బుగ్గిపాలు అవుతాయని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

