విజయనగరం జిల్లా రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో ఓ కానిస్టేబుల్ అద్భుతంగా పాడిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైడితల్లి అమ్మవారి శత జాతరలో భాగంగా సంగీత కార్యక్రమం నిర్వహించారు. జాతరకు బందోబస్తు విధుల కోసం వచ్చిన కానిస్టేబుల్ వెంకటరమణకు కూడా స్టేజీ మీద పాడాలని అనిపించింది. దీంతో సీఐను పర్మిషన్ అడిగి.. భైరవద్వీపంలోని శ్రీతుంబుర నారద నాదామృతం పాట పాడగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సంగీత విభావరి వీక్షకులను సంగీత ప్రవాహంలో ముంచెత్తింది. ఈ క్రమంలోనే జనాన్ని చూసిన ఉత్సాహంతో ఏమో కానీ.. అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వెంకటరమణకు కూడా స్టేజీ మీదకు ఎక్కి ఓ పాట అందుకోవాలని అనిపించింది. దీంతో నేరుగా వెళ్లి రాజాం సీఐ ఉపేంద్రను కోరారు. దీంతో కానిస్టేబుల్ వెంకటరమణకు వేదికపై పాడే అవకాశం లభించింది. దీంతో స్టేజీ మీదకు చేరుకున్న కానిస్టేబుల్ వెంకటరమణ.. తన గొంతును సవరించుకుని.. భైరవద్వీపంలోని శ్రీతుంబర నారద నాథామృతం పాటను ఆలపించారు. ఈ పాటలో వచ్చే పదాలను అలవోకగా పాడి వచ్చినవారిని ఆకట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోలిపల్లి పైడితల్లి అమ్మవారి శత జాతర మహోత్సవాలు
మరోవైపు మంగళవారం రోజు ఉత్సవాలలో చివరి రోజు. దీంతో అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. ఆలయ అర్చకులు ఉదయమే అమ్మవారికి విశేష పూజలు, పుష్పాలంకరణ నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్తో నిఘా ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి జాతరలో పరిశుభ్రత పనులు చేపడుతున్నారు.


