ఈ క్రమంలో టాయిలెట్ సీటుపై గంటల తరబడి సమయాన్ని వృథా చేస్తున్నారు. అయితే, ఈ చిన్న అలవాటు మీ ప్రాణాల మీదకు తెస్తుందని, ముఖ్యంగా పైల్స్ వంటి భయంకరమైన సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం నిద్రలేవగానే చాలా మందికి మొబైల్ ఫోన్ చూడటం అలవాటు. అది వాష్రూమ్ వరకు కూడా కొనసాగుతోంది. ఫోన్ చూస్తూనో లేదా పేపర్ చదువుతూనో సమయం తెలియకుండా టాయిలెట్ సీటుపై కూర్చుండిపోవడం వల్ల కలిగే నష్టం మామూలుగా లేదు. మనం కూర్చునే ఆ భంగిమ, అక్కడ గడిపే ఆ అదనపు నిమిషాలు శరీరంలోని ఒక ముఖ్యమైన భాగాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తాయని మీకు తెలుసా? చాలా మంది తమ దగ్గరకు పైల్స్ వంటి సమస్యలతో రావడానికి ప్రధాన కారణం ఇదేనని వైద్య నిపుణులు బాంబు పేల్చారు.
రక్తనాళాలపై ఒత్తిడి..
మనం సాధారణ కుర్చీలో కూర్చున్నప్పుడు మన శరీరం ఉండే తీరుకు, టాయిలెట్ ఓవల్ ఆకారపు సీటుపై కూర్చున్నప్పుడు ఉండే తీరుకు చాలా తేడా ఉంటుంది. టాయిలెట్ సీటుపై కూర్చున్నప్పుడు మలాశయం మిగిలిన శరీర భాగాల కంటే తక్కువ స్థానంలో ఉంటుంది. దీనివల్ల భూమికి ఉండే గురుత్వాకర్షణ శక్తి మన కటి ప్రాంతంపై విపరీతమైన ఒత్తిడిని తీసుకొస్తుంది. ఈ ఒత్తిడి వల్ల రక్తప్రసరణలో మార్పులు సంభవిస్తాయి.
ఎక్కువ సేపు టాయిలెట్ సీటుపై కూర్చోవడం వల్ల మలాశయంలోని రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. అక్కడి కవాటాల మీదుగా ప్రవహించే రక్తం తిరిగి వెనక్కు వెళ్లలేని స్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఆ రక్తనాళాలు ఉబ్బిపోయి ‘పైల్స్’ రావడానికి ప్రధాన కారణమవుతాయి. అంతేకాకుండా, పేగులో కొంత భాగం కిందకు జారిపోయే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మలవిసర్జన సమయంలో ముక్కడం లేదా ఎక్కువ సేపు ఆ పొజిషన్లో ఉండటం వల్ల కటి సంబంధిత కండరాలు బలహీనపడతాయి.
నిపుణుల సూచనలు..
- వాష్రూమ్లో 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు అస్సలు ఉండకూడదు.
- మొబైల్ ఫోన్లు, న్యూస్ పేపర్లు, బుక్స్ వంటివి టాయిలెట్లోకి తీసుకెళ్లడం వెంటనే మానేయాలి.
- మలవిసర్జన సమయంలో విపరీతంగా ముక్కడం వల్ల సమస్య తీవ్రతరమవుతుంది.
ఫోన్ చూడటం వల్ల మానసిక వినోదం దొరకవచ్చు కానీ, అది మీ శరీరానికి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తోంది. మలబద్ధకం లేదా ప్రేగు కదలికల విషయంలో ఇబ్బంది పడేవారు వెంటనే వైద్యులను సంప్రదించాలి తప్ప, టాయిలెట్ సీటుపై ఎక్కువ సమయం గడపకూడదు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఈ చిన్న మార్పును ఈరోజే మొదలుపెట్టండి.

