ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26 మంది ఆర్డీవోలను ఒకేసారి బదిలీ చేసింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. 2018 గ్రూప్ -1 నియామకాలపై హైకోర్టులో దాఖలైన రిట్ అప్పీల్ తీర్పు మేరకు ఏపీ ప్రభుత్వం ఈ మూకుమ్మడి బదిలీ నిర్ణయం తీసుకుంది. తదుపరి పోస్టింగ్ల కోసం వీరందరినీ జీఏడీలో రిపోర్ట్ చేయాలని సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీఎస్ విజయానంద్.. విధుల్లో ఉన్న 26 మంది ఆర్డీవోలను బదిలీ చేశారు. వారిని బాధ్యతల నుంచి తప్పించి, సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేస్తూ సీఎస్ విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 2018 గ్రూప్ -1 రిక్రూట్మెంట్ ప్రక్రియలో జరిగాయంటున్న లోపాలపై విచారణ ముగిసి, తీర్పు వచ్చే వరకు వీరంతా అప్రాధాన్య పోస్టులలో ఉండే అవకాశాలు ఉన్నాయి.
అసలు వివాదం..
2018 గ్రూప్-1 పరీక్షల ప్రక్రియపై పలు ఆరోపణలు ఉన్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. దీంతో కొంతమంది అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో భాగంగా తొలుత డిజిటల్ మూల్యాంకనం చేశారని, మళ్లీ మాన్యువల్ మూల్యాంకనం చేశారని .. ఈ ప్రక్రియలో పారదర్శకత లేదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఒకే పేపర్ను మూడుసార్లు మూల్యాంకనం చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల పిటిషన్ విచారించిన హైకోర్టు, పాత ఎంపిక జాబితాను రద్దుచేయటంతో పాటుగా మళ్లీ కొత్తగా మూల్యాంకనం చేయాలనిగతంలో తీర్పునిచ్చింది.
మరోవైపు 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా 167 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరు రాష్ట్రంలోని వివిధ కీలక శాఖల్లో పనిచేస్తున్నారు. కొంతమంది ఆర్డీవోలుగా, మరికొంతమంది డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లుగా పనిచేస్తున్నారు. అయితే అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలంటూ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. తాజాగా 26 మంది ఆర్డీవోలను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


