TTD on Fake Websites: దళారులు, నకిలీ వెబ్సైట్ల గురించి అప్రమత్తంగా ఉండాలని శ్రీవారి భక్తులకు టీటీడీ సూచించింది. కేరళకు చెందిన ఓ భక్తుడు మోసపోయిన నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టగా.. విచారణలో టీటీడీ పేరును ఉపయోగించుకుంటూ, తిరుమల శ్రీవారి ఆలయం ఫోటోలు వాడుకుంటూ నకిలీ వెబ్సైట్లు రూపొందించి శ్రీవారి భక్తులను తప్పుదారి పట్టిస్తున్న వైనాన్ని గుర్తించింది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ సందర్శించాలని సూచించింది.

ఈ విచారణలో తిరుమల శ్రీవారి ఆలయం ఫోటోలు, టీటీడీ పేరును అనధికారికంగా వాడుకుంటూ కొంతమంది నకిలీ వెబ్సైట్లు రూపొందించినట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ నకిలీ వెబ్ సైట్ల సాయంతో భక్తులను తప్పుదారి పట్టిస్తున్నట్టు గుర్తించింది. గూగుల్లో వెతికినప్పుడు కూడా ఈ ఫేక్ వెబ్సైట్లు కనిపిస్తున్నట్లు టీటీడీ గుర్తించింది, ఈ నకిలీ వెబ్ సైట్ల ద్వారా భక్తుల నుంచి ఆన్లైన్ విధానంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి నకిలీ వెబ్సైట్లపై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు టీటీడీ చిహ్నాలు, ఆలయం ఫోటోలను అనధికారికంగా ఉపయోగించే వెబ్సైట్లపై కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు ఇలాంటి నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని.. తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, సేవా టికెట్ల కోసం టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.inను సంప్రదించాలని సూచించింది. దళారులు, నకిలీ వెబ్ సైట్లను నమ్మి మోసానికి గురికావొద్దని విజ్ఞప్తి చేసింది.
అనుమానాస్పద వెబ్సైట్లు, ఫోన్ కాల్స్ గురించి సమాచారం ఉంటే వెంటనే టీటీడీ దృష్టికి తీసుకురావాలని టీటీడీ కోరింది.
అన్నప్రసాద వితరణ కేంద్రాల మూసివేత
మరోవైపు మార్చి మూడో తేదీ చంద్రగ్రహణం కావటంతో తిరుపతి, తిరుచానూరులోని టీటీడీ అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుచానూరులోని ఎస్వీ నిత్య అన్నప్రసాద భవనం, తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్, పద్మావతి విశ్రాంతి భవనంలోని క్యాంటీన్, శ్రీనివాసం, విష్ణునివాసం వసతి సముదాయాల్లో ఉచిత అన్నప్రసాద వితరణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుపతిలోని ప్రభుత్వ వైద్యశాలలు, వివిధ ప్రథమ చికిత్స కేంద్రాల్లో రోగులు, వారి సంరక్షకులకు అందించే అన్నప్రసాదాలను ముందస్తుగా పంపిణీ చేయనున్నారు.


