తెలుగు రాష్ట్రాల వైద్య చరిత్రలో ఇప్పటికే ఎన్నో అత్యాధునిక వైద్య విధానాలను అందుబాటులోకి తెచ్చి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన హైదరాబాద్ నగరంలోని వైద్యులు.. ఇప్పుడు వారసత్వంగా వచ్చే అమెగాకార్యోసైటిక్ థ్రోంబోసైటోపెనియా అనే అరుదైన ఎముక మజ్జ వైఫల్యంతో బాధపడుతున్న 10 నెలల వయసున్న చిన్నారి ఎం. ఖాదర్ అర్మాన్ కు అత్యాధునిక హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ మార్పిడి చేసి కొత్త జీవితాన్నిచ్చారు.. ఈ అరుదైన వ్యాధికి సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్ చికిత్సను అందించి.. సరికొత్త చరిత్రను లిఖించింది.
వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా, నందవరం కి చెందిన ముళ్ళ ఖాజా, రేష్మ ల 10 నెలల వయసున్న చిన్నారి నిరంతరం తక్కువ ప్లేట్లెట్స్ కౌంట్ నిర్దారణతో మా యశోద హాస్పిటల్స్-సోమాజిగూడకు గత నెల డిసెంబర్ 26, 2025న తీసుకురావడం జరిగింది. ఆసుపత్రిలో చేరినప్పుడు, పిల్లవాడు ఆహారం ఇస్తున్నప్పుడు ఆస్పిరేషన్ ఎపిసోడ్ ను అనుభవించాడు. దీని ఫలితంగా ఆకస్మిక శ్వాసకోశ ఇబ్బంది, హైపోక్సియా, బ్రాడీకార్డియా వచ్చాయి. అతనికి వెంటనే ఇంట్యూబేట్ చేసి నాలుగు రోజుల పాటు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో యాంత్రిక వెంటిలేషన్ నిర్వహించడం జరిగిందన్నారు. సమగ్ర క్లినికల్, ప్రయోగశాల అంచనా తర్వాత, ఆ బాబుకి పుట్టుకతో వచ్చే అమెగాకార్యోసైటిక్ థ్రోంబోసైటోపెనియా ఉన్నట్లు నిర్ధారణ అయిందని యశోద హాస్పిటల్స్-సోమాజిగూడ, సీనియర్ హేమాటో-ఆంకాలజిస్ట్ & బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ స్పెషలిస్ట్, డాక్టర్. అశోక్ కుమార్ పిళ్ళై తెలిపారు.
Hyderabad Yashoda Hospitals
ఇది తీవ్రమైన థ్రోంబోసైటోపెనియా, రక్తస్రావం ప్రమాదంతో కూడిన అరుదైన వారసత్వంగా వచ్చే ఎముక మజ్జ వైఫల్య రుగ్మత అని తెలిపారు. ఈ పరిస్థితికి ఏకైక నివారణ చికిత్స అలోజెనిక్ హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్ మార్పిడే అని తల్లిదండ్రులైన ముళ్ళ ఖాజా, రేష్మే లకు వివరించడం జరిగింది. వారి ఆమోదంతో స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ ను మొదలు పట్టడం జరిగింది. పూర్తిగా సరిపోలిన దాత అందుబాటులో లేనందున, పిల్లాడి తండ్రిని అంచనా వేసి హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ దాతగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ 10 నెలల వయసున్న బాబుకి పితృ మూల కణాలను ఉపయోగించి హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ జనవరి 8, 2026న విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ తరువాత పిల్లవాడికి తగిన క్రిటికల్ కేర్ సపోర్ట్, నిపుణులైన వైద్య బృందం 24 గంటల పర్యవేక్షణతో, పిల్లవాడు స్థిరంగా కోలుకున్నాడు. క్రమంగా ప్లేట్లెట్స్ కౌంట్ మెరుగుపడటంతో వెంటిలేటరీ సపోర్ట్ నిలిపివేయబడింది. ఆ పిల్లవాడు వైద్యపరంగా స్థిరంగా ఉన్నాడు అని నిర్దారించుకున్న తరువత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయగలిగామని ఈ పరిస్థితి విజయవంతమైన స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఫలితాన్ని సూచిస్తుందని డాక్టర్ పిళ్ళై తెలియజేసారు.
ఈ కేసు అరుదైన పీడియాట్రిక్ హెమటోలాజికల్ రుగ్మతల నిర్వహణలో ముందస్తు రోగ నిర్ధారణ, సకాలంలో అధునాతన మార్పిడి సౌకర్యాల లభ్యత, సమన్వయంతో కూడిన బహుళ విభాగ సంరక్షణ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుందన్నారు. విజయవంతమైన ఫలితం హెమటాలజీ, ట్రాన్స్ప్లాంటేషన్ విభాగాలు, పీడియాట్రిక్స్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగం, నర్సింగ్, హాస్పిటల్ మేనేజ్మెంట్ విభాగాల సమిష్టి ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది. ఇటువంటి కేసులు గతంలో ప్రాణాంతకమైన అనేక బాల్య రక్త రుగ్మతలను ఇప్పుడు ఆధునిక వైద్య సంరక్షణతో నయం చేయవచ్చని, ఈ కేసు ఫలితం ముందస్తు రోగ నిర్ధారణ, తగిన చికిత్స పద్దతులు సాధారణ ప్రజలలో అవగాహన పెంచడానికి సహాయపడుతాయని డాక్టర్. ఎస్. ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

