కాకినాడ పేలుడు ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. ఆర్డీఓతో పాటుగా.. డీఎస్పీ, డిస్టిక్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాద స్థలిని పరిశీలించిన చంద్రబాబు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.

మరోవైపు గాయపడినవారికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. పేలుడు పదార్థాల వద్ద సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం కనిపిస్తోందన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు.. బాధ్యులైనవారి ఆస్తులు జప్తు చేసి బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అలాగే ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా బాణసంచా తయారు చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.అంతకుముందు సామర్లకోట మండలంలోని వేట్లపాలెంలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఘటన గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సహాయకచర్యల గురించి ఆరా తీశారు.
వేట్లపాలెం పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పోస్టు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 పరిహారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మరోవైపు వేట్లపాలెం ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


