తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. భక్తుల కోసం ఇప్పటికే తిరుమలలో పలుచోట్ల అన్న ప్రసాద భవనాలు ఏర్పాటు చేయగా.. త్వరలో మరో భవనం కూడా సిద్దం కానుంది. టీటీడీకి రిలయన్స్ సంస్థ రూ.120 కోట్ల విరాళం అందించింది. ఈ నగదుతో శ్రీవారి భక్తుల కోసం మరో అన్న ప్రసాద భవనం తిరుమలలో నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాద భవనంతో పాటు కిచెన్ నిర్మించనున్నారు. అలాగే తిరుమలలో శ్రీవారి ముడుపు పత్రం పథకాన్ని ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు. పలు పనులకు ఈ సందర్భంగా టీటీడీ ఆమోదం తెలిపింది.
త్వరలోనే పనులు ప్రారంభం
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన తాజాగా టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ మసమావేశంలో 2026-27 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.5,456 కోట్ల బడ్జెట్ను ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కూడా బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్లో పలు పథకాలు, పనులను చేపట్టేందుకు నిధులు కేటాయించారు. టీటీడీ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మెరుగైన ఎడ్యుకేషన్ అందించేందుకు రూ.118 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఈ నిధులతో డిజిటల్ క్లాస్ రూమ్లు, కిచెన్ గదులు, అదనపు హాస్టల్ బ్లాకులు నిర్మించనున్నారు. అలాగే విద్యా సంస్థల్లో ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పించేందుకు వీటిని ఖర్చు చేయనున్నారు.
ముడుపు పత్రం పథకం ప్రారంభం
తిరుమలలో ముడుపు పత్రం పథకం ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా హుండీలో కానుకలకు బదులుగా ముడుపు పత్రాలను భక్తులు వేయవచ్చు. ఇందుకోసం తిరుమలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఈ కౌంటర్లలో యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే అధికారులు ముడుపు పత్రాలు ఇస్తారు. భక్తులు నగదు, నాణేలు తీసుకురావాల్సిన అవసరం లేకుండా ఈ ముడుపు పత్రాలను హుండీలు వేసి మొక్కులు చెల్లించుకోవచ్చు. అటు ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం రూ.20.17 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చేవారికి రూ.50 విలువైన శ్రీవారి లడ్డూ ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇక వకుళమాత ఆలయంలో అక్షర గోవిందం పేరుతో అక్షరాభాస్య కార్యక్రమం ప్రారంభించేందుకు సిద్దమయ్యారు.

