ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్కు సీఎం స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలూ సమావేశమయ్యారు. సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ మంత్రిత్వ శాఖలు అయిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలపైనా చర్చించినట్లు సమాచారం.

అలాగే రాష్ట్రంలోని వివిధ పంచాయతీలలో చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణ పనుల గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. సీఎం చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది. ఈ తరహా మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణాలను అన్ని పంచాయతీలలో నిర్మించేలా ఆలోచనలు చేసినట్లు సమాచారం. నీటిపారుదల శాఖ పరిధిలోని డ్రైనేజీలలో వేసవిలోనే పూడికతీత పనులు చేపట్టాలని.. రైతులు పంట వేసేలోపు ఈ పనులు పూర్తయ్యేలా చూడాలని నిర్ణయించారు.ఈ క్రమంలోనే ఏపీ అటవీ శాఖ హనుమాన్ పేరుతో చేపట్టిన ప్రాజెక్టు వివరాలను చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ వివరించారు.
ఇక రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో.. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపైనా ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. పలు అంశాలపై మాట్లాడుకోవాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా.. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో పవన్ కళ్యాణ్.. సీఎం చంద్రబాబుతో భేటీ అయినట్లు డిప్యూటీ సీఎంవో వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఏపీలో ఇటీవలి కాలంలో రాజమండ్రి కల్తీపాల ఘటన, శ్రీకాకుళం డయేరియా, వేట్లపాలెం బాణాసంచా పేలుడు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చుట్టూ వివాదం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది.


