AP High Court Anticipatory Bail To Janasena Party Mla Arava Sridhar Episode Woman: రైల్వేకోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్లో ఆరోపణలు చేసిన మహిళకు హైకోర్టులో ఊరట దక్కింది. ఎమ్మెల్యేను బెదిరించారని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన కేసులో ఏపీ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసింది. బెయిల్ షరతుల్ని పాటించాలని.. ఒకవేళ పాటించకపోతే బెయిల్ రద్దుకు పోలీసులు కోర్టును ఆశ్రయించొచ్చని తెలిపింది.
హైలైట్:
- రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్
- మహిళకు ఏపీ హైకోర్టులో షరతులతో బెయిల్
- ఎమ్మెల్యే తల్లి ఫిర్యాదుతో మహిళపై కేసు

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ఆరోపణలు చేసిన మహిళపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. మహిళ తన కుమారుడు, కుటుంబసభ్యులతో పరిచయం పెంచుకున్నారన్నారు. ఏకంగా రూ.25 కోట్లు డిమాండ్ చేసిందని.. ఆమె తన కుమారుడ్ని బెదిరించారని, కుట్ర చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానని బెదిరించినట్లు ఆరోపించారు. ఈ మేరకు రైల్వే కోడూరు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
జనసేన పార్టీ రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఓ మహిళ లైంగిక దాడి, మోసం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె అరవ శ్రీధర్తో ప్రైవేట్గా మాట్లాడినట్లుగా కొన్ని వీడియోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తనకు న్యాయం చేయాలంటూ ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జనసే పార్టీ ఈ ఆరోపణలపై విచారణ చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ శ్రీధర్ను ప్రశ్నించింది. బాధితురాలు చేసిన ఆరోపణలు, వాట్సాప్ చాటింగ్ వ్యవహారంపై ఆరా తీశారు. తనపై వచ్చిన ఆరోపణలకు జనసేన పార్టీ ఏర్పాటు చేసిన కమిటీకి వివరణ ఇచ్చానన్నారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే కట్టుబడి ఉంటానని.. అలాగే తనపై నమోదైన కేసులను చట్టపరంగానే ఎందుర్కొంటానని శ్రీధర్ చెబుతున్నారు.


