2029 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 70కిపైగా స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన నేత, తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన కిరణ్ రాయల్.. ఎన్నికల పొత్తులు, సీట్ల లెక్కలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ లేకుంటే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చేది కాదని.. టీడీపీ ఎలక్షన్ కూడా చేయలేకపోయేదన్నారు. గతంతో పోలిస్తే తమ బలం పెరిగిందన్న కిరణ్ రాయల్.. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి మళ్లీ 21 సీట్లు ఇస్తామంటే అంగీకరించమని స్పష్టం చేశారు.

మురోవైపు 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ర్, చంద్రబాబు కలవకపోయి ఉంటే మళ్లీ జగన్ అధికారంలోకి వచ్చి ఉండేవారని కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ను నమ్మి జనం ఓటేశారని అన్నారు. రాజకీయాల్లో ఉండాలన్నా, ఎన్నికల్లో పోటీ చేయాలన్నా ప్రజాబలంతో పాటుగా ఆర్థిక బలం కూడా ఉండాలన్న కిరణ్ రాయల్.. ఆర్థిక బలంగా అంతగా లేకపోవటంతోనే గత ఎన్నికల్లో పోటీ చేయలేకపోయినట్లు తెలిపారు. తనకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్, హరిప్రసాద్కు విభేదాలు ఉన్నాయనే ప్రచారంపైనా కిరణ్ రాయల్ స్పందించారు. తాము ఎక్కడున్నా, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ కోసమే పనిచేస్తున్నామని అన్నారు. వైసీపీ నుంచి కొంతమంది జనసేనలో చేరారని.. వారు ఇప్పుడిప్పుడే తమ పార్టీకి అలవాటు పడుతున్నారని కిరణ్ రాయల్ చెప్పారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాల్లో పోటీచేసింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన జనసేన.. వందశాతం స్ట్రైయిక్ రేట్ నమోదు చేసింది. అనంతరం ప్రభుత్వంలో చేరిన జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు వరించాయి.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. నాదెండ్ల మనోహర్ ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రిగా, కందుల దుర్గేష్ ఏపీ పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే జనసేన పార్టీ బలం పెరిగిందంటున్న కిరణ్ రాయల్.. ఈసారి తమకు 70కి పైగా సీట్లు కావాలని ఇప్పటి నుంచే డిమాండ్ చేస్తున్నారు.


