విజయవాడ దుర్గగుడిలో కుంభాభిషేకానికి సర్వం సిద్ధమైంది. మరో రెండు రోజులలో కుంభాభిషేకం మొదలు కానుంది. మార్చి ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకూ మూడు రోజుల పాటు కుంభాభిషేకం క్రతువు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు దుర్గగుడి అధికారులు కీలక విజ్ఞప్తి చేశారు. కుంభాభిషేకం సందర్భంగా యాగశాలలోకి భక్తులకు అనుమతి లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆలయానికి వచ్చి దర్శనాలు చేసుకోవచ్చని సూచించారు.
హైలైట్:
- విజయవాడ దుర్గగుడిలో కుంభాభిషేకం
- మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభం
- మూడు రోజుల పాటు కొనసాగనున్న కుంభాభిషేకం

కుంభాభిషేకం.. ఏ రోజున ఏం చేస్తారంటే..
మార్చి ఆరో తేదీన యాగశాలలో ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ నిర్వహిస్తారు. తర్వాత పుణ్యాహవచనం, దీక్షాధారణ, పంచగవ్వ ప్రాశనం, అఖండ దీపారాధన వంటి కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపన కార్యక్రమాలతో పాటుగా.. మూలమంత్ర హవనములు, హారతి ఉంటుంది. రాత్రి 7 మంత్ర పుష్పం కార్యక్రమం ఉంటుంది.
మార్చి ఎనిమిదో తేదీ ఉదయం 8 గంటలకు అష్టోత్తర కలశస్థాపన, పూజ, పీఠ పూజలు ఉంటాయి. మధ్యాహ్నం 12గంటలకు మూలమంత్ర హవనములు కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం ప్రదోషకాల పీఠపూజలు, హారతితో పాటుగా 7 గంటలకు మంత్ర పుష్పం ఉంటుంది. ఆఖరి రోజైన మార్చి ఎనిమిదో తేదీ ఉదయం మంటప పూజలు, మూలమంత్ర హవనములు, పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి ఉదయం 9.34 నిమిషాలకు అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో కుంభాభిషేకం నిర్వహిస్తారు. మరోవైపు కుంభాభిషేకం కార్యక్రమానికి భక్తులకు అనుమతి లేదని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇది అంతర్గత కార్యక్రమమని.. యాగశాలలోకి భక్తులను అనుమతించమని క్లారిటీ ఇచ్చారు. అయితే దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని వెల్లడించారు.


