తిరుమల శ్రీవారి సన్నిధిలో బుల్లితెర నటి, బిగ్బాస్ సీజన్ 9 రన్నరప్ తనూజ పుట్టిన రోజు వేడులు ఇప్పుడు వివాదంగా మారాయి. ఆమె పుట్టిన రోజు సందర్భంగా కొండపై దివ్వెల మాధురి కేక్ కట్ చేయడంతో విమర్శలు వస్తున్నాయి. ఇది ఆలయ పవిత్రతకు విరుద్దమని, కొండపై కేక్లు నిషేధమైనా ఎలా వెళ్లాయనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది.

గతంలోనూ ఒకసారి దివ్వెల మాధురి తిరుమలలో రీల్స్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. శ్రీవారి సన్నిధిలో దువ్వాడ శ్రీనివాస్తో కలసి రీల్స్ చేసి విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ విషయంలో ఆమెపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఆలయ సంస్కృతిని, సంప్రదాయాలను ఉల్లంఘించారని భక్తులు, టీటీడీ అధికారులు పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేశారు. శ్రీవారి పుష్కరిణితో పాటు ఆలయం వద్ద ఫొటో షూట్ చేసి, వాటిని మీడియాతో పంచుకున్నారు. దీనిపై విమర్శలు రావడంతో ఆమె క్షమాపణలు చెప్పారు. అయినాసరే మళ్లీ అలాంటి చర్యకే పాల్పడటంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కాగా, దివ్వెల మాధురి బిగ్బాస్ సీజన్ 9లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అక్కడ తనూజతో ఆమెకు ఏర్పడిన స్నేహం బయటకొచ్చిన తర్వాత కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆమెతో కలిసి తిరుమలకు వెళ్లి.. పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. కేక్ కట్చేయించి.. చీర, గాజులు, బంగారు చెవి దిద్దులను తనూజకు మాధురి కానుకగా ఇచ్చారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ‘‘హ్యాపీ బర్త్ డే బంగారం.. స్వర్గం నుంచి దిగివచ్చిన మై స్వీట్ హార్ట్.. తనూజతో జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు’’ అంటూ సోషల్ మీడియాలో పెట్టారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, తనూజలు కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.


