
Bajaj Pulsar: ఈ మధ్య వాహనాలు దగ్ధమవుతున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. ఎలెక్ట్రిక్ బైక్ల విషయంలో ఆ ప్రమాదం ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ మామూలుగా ఇంధనంతో నడిచే బండ్లు కూడా ఇలా ప్రమాదానికి గురవడం వాహనదారులను కలవరపెడుతోంది. హైదరాబాద్లోని ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న నయారా పెట్రోల్ బంక్లో ఇంధనం నింపుకున్న వెంటనే ఓ బజాజ్ పల్సర్ NS200 బైక్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్పుడే పెట్రోల్ కొట్టించుకుని బంకులోకి వెళ్లిన వ్యక్తి.. తన బైక్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురై పరుగులు తీశాడు. దీంతో అక్కడే ఉన్న వాహనదారులు కూడా భయంతో పరుగులు తీశారు.
బైకర్ మంటలను గమనించి అప్రమత్తం కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది. మంటలు పెద్దఎత్తున వేగంగా వ్యాపించడంతో బైక్ పూర్తిగా కాలిపోయింది. ఇందుకు కారణం వాతావరణంలో మొదలైన తీవ్రమైన వేడి కారణమని అంటున్నారు. ఎండ తీవ్రతకు వాహనం ఫుల్లుగా వేడెక్కి తద్వారా మంటలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: మీరు క్రెడిట్ కార్డు విషయంలో ఈ పొరపాటు చేస్తే అరెస్ట్ చేస్తారా? చట్టం ఏం చెబుతోంది?
తీవ్రమైన వేడి కారణంగా ఆలివ్ సర్వోదయ ఆసుపత్రి ముందు ఆపి ఉంచిన శాంట్రో కారు కూడా పాక్షికంగా దెబ్బతింది. అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఇంటి ముందు, ఆఫీస్ ముందు ఆరుబయట వాహనాలను గంటల కొద్దీ నిలిపి ఉంచడం.. ఎండ నుంచి రక్షించే పరిస్థితులు లేని సమయంలో వాహనాలు వాతావరణంలోని వేడి తీవ్రతను తట్టుకోలేకపోవడం ద్వారా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కారణంగా వాహనదారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా ఎలాంటి నీడ సౌకర్యం లేకుండా ఆరుబయట ప్రాంతాల్లో వాహనాలను ఎక్కువ సేపు నిలిపి ఉంచే వాహనదారులు జాగ్రత్త పడకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే బీ కేర్ ఫుల్..!
ఇది కూడా చదవండి: Debit Card: మీ డెబిట్ కార్డ్ ATM మెషీన్లో ఇరుక్కుపోతే.. నో టెన్షన్.. ప్రాసెస్ ఏంటో తెలుసా?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

