ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో శనివారం రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు లక్ష్మీదుర్గపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మరోవైపు సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ కేసులో లక్ష్మీదుర్గను సిట్ ఏ2గా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిట్ అధికారులు రాజమహేంద్రవరం కోర్టులో అనుబంధ అభియోగపత్రం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం లక్ష్మీ దుర్గపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలో ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు లక్ష్మీ దుర్గ కూడా పాల్గొన్నారని సిట్ అధికారులు తేల్చిన సంగతి తెలిసిందే. సుబ్రమణ్యం హత్యకు ప్రేరేపించడంతో పాటుగా అనంతబాబుకు సహకారం అందించారని సిట్ పేర్కొంది. అలాగే హత్య జరిగిన తర్వాత సాక్ష్యాధారాలను మాయం చేయటంలోనూ లక్ష్మీ దుర్గ కీలకంగా ఉన్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంది. హత్య సమయంలో ఘటనాస్థలిలో లక్ష్మీదుర్గ ఉన్నారని.. సుబ్రమణ్యం మృతదేహాన్ని తీసుకెళ్లిన వాహనంలోనూ ఆమె ఉన్నారని సిట్ తేల్చింది. ఈ నేపథ్యంలోనే సుబ్రమణ్యం హత్య కేసులో లక్ష్మీ దుర్గను ఏ2గా చేర్చింది. ఈ వివరాలతో రాజమండ్రి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు.
2022 మే నెలలో సుబ్రమణ్యం హత్య జరిగింది. అనంతరం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే 2024 ఎన్నికల తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో.. తమ కుమారుడి కేసును మళ్లీ విచారించాలంటూ సుబ్రమణ్యం తల్లిదండ్రులు సీఎం చంద్రబాబు. డీజీపీ వద్ద మొరపెట్టుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుబ్రమణ్యం హత్య కేసుపై సిట్ ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో సుబ్రమణ్యం హత్య కేసులో లక్ష్మీదుర్గ ప్రమేయం కూడా ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెను ఏ2గా చేర్చారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు.. ఇప్పటికే జైలుకు వెళ్లివచ్చారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు.
ఏ2గా ఉన్న లక్ష్మీదుర్గకు పోలీసులు ఓ సారి నోటీసులు జారీ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే ఆమె విచారణకు హాజరు కాలేదు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో లక్ష్మీదుర్గ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


