ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ విషయంలో చంద్రబాబు కంటే లోకేష్ను మెచ్చుకోవచ్చంటూ ఓ ఇంటర్వ్యూలో కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ను నారా లోకేష్ నేర్పిస్తున్నారని.. జగన్ చాలా క్విక్ లెర్నరని, త్వరగా నేర్చుకుంటారని అన్నారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

“ఒక విషయంలో నారా లోకేష్ను మెచ్చుకోవాలి, వాళ్ల నాన్న కంటే.. ప్రజలకు ఏం చేస్తాడో, ఏం లేదో తెలియదు కానీ.. తాను చేయాలని అనుకున్నవి చేస్తున్నారు. అది రెడ్ బుక్ రూపంలో కావచ్చు. ఇంకోటి కావచ్చు. ఒక కొత్త సంప్రదాయాన్ని నిర్మిస్తున్నారు. అది ఎలాంటి సంప్రదాయమంటే జగన్ మోహన్ రెడ్డికి నేర్పిస్తున్నారు. వైఎస్ జగన్ చాలా త్వరగా నేర్చుకుంటారు. అది ఏదైనా కావొచ్చు. రాజశేఖర్ రెడ్డికి సీఎం కావడానికి 30 ఏళ్లు పట్టింది. అదే జగన్కు ఏడేళ్లు పట్టింది. నారా లోకేష్ రెడ్ బుక్ పాలన చేస్తున్నారు. దానికి బదులుగా జగన్ మూడింతలు చేస్తారుగా.. రప్పా రప్పాకే అంతలా భయపడితే ఎలా. నారా లోకేష్ ఒక కొత్త సంప్రదాయాన్ని తెచ్చారు. దానిని పటిష్టంగా, గట్టిగా, మరింత పదునుగా తీసుకుపోవాల్సిన బాధ్యత మా మీదా ఉంది. రప్పా రప్పా అనే చిన్న పోస్టర్కే భయపడితే ఎలా” అంటూ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పరోక్షంగా హెచ్చరించారు.
మరోవైపు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. తెలుగు రాష్ట్రాలకు చాలా చిరపరిచితులైన వ్యక్తి. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిర్వహించిన కార్యక్రమం.. సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అయ్యింది. దీంతో కేతిరెడ్డికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే 2024 ఎన్నికల్లో కేతిరెడ్డికి షాక్ తగిలింది. నాటి ఎన్నికల్లో ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేసిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. ఓటమి పాలయ్యారు. ఎన్డీఏ కూటమి తరుఫున బీజేపీ అభ్యర్థిగా పోటీ తేసిన సత్యకుమార్ యాదవ్ గెలుపొందటం, ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టడం కూడా తెలిసిన సంగతే.
అయితే ఇప్పటికీ ధర్మవరం నియోజకవర్గంలో తన ఓటమిపై కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన రాజకీయ జీవితంలో 2024 లో ఓడిపోతే బాధపడినంతగా ఎప్పుడూ బాధపడలేదని కేతిరెడ్డి అన్నారు.చాలా ఏళ్ల నుంచి ధర్మవరంలో కష్టపడ్డానని.. అలాంటిది ఆ వ్యక్తి ఎవరో కూడా తెలీదని.. ఆయన గెలిచారంటే బాధగా ఉందంటూ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. ధర్మవరం రాజకీయాల్లో 20 ఏళ్ల నుంచి తాను ఉన్నానని.. కానీ రెండు నెలల ముందు వచ్చిన వ్యక్తి గెలిచారంటే బాధగా ఉందన్నారు.


