AP Govt Employee Avinash Singh Suicide Attempt Issue Fact Check: ఏపీ సచివాలయంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశారంటూ ప్రచారం జరుగుతోంది. తనను తెలంగాణకు బదిలీ చేయలేదనే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు కొందరు సోషల్ మీడియాలో పోస్టలు పెట్టారు. ఈ అంశంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. అవినాష్ సింగ్ బదిలీ అంశం, ఆత్మహత్యాయత్నంపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే అవినాష్ బదిలీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
హైలైట్:
- ఏపీ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
- తెలంగాణకు బదిలీ చేయలేదనే మనస్తాపం
- ఈ అంశంపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్

అవినాష్ సింగ్ స్వయంగా తాను ఎలాంటి ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదని ఓ వీడియో ద్వారా తెలియజేశారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది. కాబట్టి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, కథనం పూర్తిగా అసత్యమన్నారు. అయితే అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల మేరకు (కమీషనర్ గారి లేఖ తేదీ 19/02/2026), అంతరాష్ట్ర బదిలీల ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని ఆ వివరాలను ప్రస్తావించారు. అయితే తెలంగాణకు బదిలీ కోరుకుంటున్న ఉద్యోగుల జాబితాలో అవినాష్ సింగ్ పేరు కూడా ఉందన్నారు. ఈ మేరకు ఆ జాబితాలోని (క్రమ సంఖ్య 472) స్పష్టంగా ఉందన్నారు. బదిలీలకు సంబంధించి డేటాను అప్డేట్ చేసి, తదుపరి చర్యల కోసం తెలంగాణ ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. ఏపీ నుంచి తెలంగాణకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ సజావుగానే సాగుతోందని.. ఇలాంటి సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇదంతా కేవలం ప్రజల్ని, తోటి ఉద్యోగులను గందరగోళానికి గురిచేయడమే అంటూ ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది.
విభజన తర్వాత కూడా ఏపీలో కొందరు తెలంగాణ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే వారంతా తమను తెలంగాణకు బదిలీ చేయాలని చాలా కాలంగా కోరుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఓ జాబితాను తయారు చేసి తెలంగాణకు పంపించింది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెబుతున్నారు.


