సత్యసాయి జిల్లా కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బ్రహ్మరథోత్సవంలో భాగంగా రథం కిందపడి ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని కాపాడే క్రమంలో మరో ఐదుగురు భక్తులు గాయపడ్డారు. వీరందరినీ వెంటనే కదిరి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రోజున రథోత్సవం నిర్వహించారు.

వేలాదిమంది భక్తజన సందోహం మధ్యన వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. బ్రహ్మరథోత్సవంలో భాగంగా ఉదయం ఎనిమిది గంటల 40 నిమిషాలకు ఆలయ అర్చకులు స్వామివారికి నిత్యకైంకర్యాలు, పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల జయజయధ్వానాల నడుమ రథం ముందుకు కదిలింది. ఈ కార్యక్రమానికి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు తరలివచ్చారు.
రథోత్సవంలో భాగంగా స్వామివారు రథంలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు దవనం, మిరియాలు చల్లి ముక్కులు చెల్లించుకున్నారు. రథంలో ఆసీనుడైన నరసింహస్వామిపై దవనం, మిరియాలు చల్లితే పాపాలు తొలగి అష్టఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. దీంతో అధిక సంఖ్యలో భక్తులు కదిరి బ్రహ్మరథోత్వానికి హాజరవుతుంటారు. ఈ కార్యక్రమం కోసం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.


