తిరుపతిలోని వాహనదారులకు ముఖ్య గమనిక. తిరుపతిలోని గరుడ వారధిపై ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. గరుడ వారధిపై పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో తిరుపతి జిల్లా యంత్రాంగం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు అమలులో భాగంగా కలెక్టర్, ఎస్పీ, కమిషనర్ల సంయుక్త సమీక్ష సమావేశంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే తిరుపతి గరుడ వారధిపై జరుగుతున్న ప్రమాదాల గురించి చర్చించారు. గరుడ వారధి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల వివరాలను పరిశీలించి ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రజాభద్రతే ప్రాధాన్యంగా గరుడ వారధి పై ద్విచక్ర, భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. ప్రజల భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని తిరుపతి జిల్లా యంత్రాంగం ప్రజలకు సూచించింది. ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరింది. అలా కాదని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు.
వడమాలపేట వద్ద ప్రమాదం
మరోవైపు తిరుపతి జిల్లా వడమాలపేట అంజేరమ్మ కనుమ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆలయం వద్ద ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును కారు ఢీకొట్టింది. ఆ కారును వెనుకనే వస్తున్న మరో కారు ఢీకొట్టింది. చెన్నై నుంచి తిరుపతి వైపు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.
ప్రమాదంలో కారులోని వారికి స్వల్పగాయాలయ్యాయి. అయితే పెను ప్రమాదం తప్పటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు జాతీయ రహదారిపై ప్రమాదంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.


