Tiger Enter Into Kakinada District,కాకినాడ జిల్లాలోకి పెద్దపులి ఎంట్రీ.. ప్రజలకు అటవీశాఖ అధికారుల అలర్ట్ – tiger movement in kakinada district creates panic in local people
Kakinada District Tiger Tension: మరోసారి పెద్దపులి టెన్షన్ వెంటాడుతోంది.. పులి ఇవాళ కాకినాడ జిల్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. పులి కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రత్తిపాడు సమీపంలో ఉన్న పెద్దపులి పయనం ఎటు వైపు ఉంటుందనేది అంచనా వేయలేకపోతున్నారు. అనకాపల్లి వైపు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. పులిని ఈసారి మత్తు మందుతో కాకుండా బోనులో బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
ఏపీలోని గోదావరి తీర ప్రాంతాన్ని పెద్దపులి టెన్షన్ వెంటాడుతోంది. మొన్నటి వరకు పోలవరం జిల్లాలో సంచరించిన పులి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం దారపల్లి అటవీ ప్రాంతం పరిసరాల్లో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ పులి ఎటువైపు వెళుతుందనే టెన్షన్ అందరిలో మొదలైంది. పులి పయనం ప్రత్తిపాడు, శంకవరం వైపా.. అనకాపల్లి జిల్లా వైపు ఉంటుందా అనేది చూడాలి. పెద్దపులి సంచారంపై స్పెషల్ టీమ్స్ నిఘా పెంచారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పులి సంచారంతో స్థానికులు ఆందోళనలో ఉన్నారు.ఫిబ్రవరిలో పెద్దపులి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజల్ని వణికించింది.. అటవీశాఖ అధికారులు చాకచక్యంగా పట్టుకుని విశాఖపట్నం జూకు తరలించారు. కొద్ది రోజుల తర్వాత పులిని తీసుకెళ్లి పాపికొండలు వైపు అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఆ తర్వాత మరికొన్ని రోజుల తర్వాత మళ్లీ పోలవరం జిల్లాలో ప్రత్యక్షమైంది. కొద్దిరోజులుగా పెద్దపులి పశువుల ప్రాణాలు తీస్తోంది. ఇటీవల జనావాసాల్లోకి వచ్చిన పెద్దపులి.. పొలంలో ఉన్న ఆవును, దాని దూడను చంపేసింది. అక్కడి నుంచి కంబాలపల్లి కొండల్లోకి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. మళ్లీ రాత్రి వేళలో పొలంలో చంపిన పశువుల్ని తినడానికి వచ్చింది. ఆ సమీప ప్రాంతంలో అటవీశాఖ అధికారలు పెద్దపులి పాదముద్రల్ని గుర్తించారు. ఇప్పుడు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో సంచరిస్తున్నట్లు చెబుతున్నారు.
మరోసారి పులి సంచరిస్తుండటంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. కాకినాడ, తూర్పుగోదావరి, పోలవరం జిల్లా ధికారులు కలిసి పులిని బంధించే పనిలో ఉన్నారు. వీరికి తోడు శ్రీశైలం – నాగార్జునసాగర్ టైగర్ ప్రాజెక్టుకు చెందిన స్పెషల్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. పులి కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. అవసరమైనప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఈసారి పెద్దపులిని బోనులో బంధించే ప్రయత్నాల్లో ఉన్నారు అధికారులు. పులి సంచారంతో జనాలు వణికిపోతున్నారు.. పొలాల వైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. పెద్దపులిని త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు. మొత్తం మీద మరోసారి గోదావరి ప్రాంత ప్రజల్ని పెద్దపులి భయం వెంటాడుతోంది.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి