
ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. యుద్ద పరిస్థితుల క్రమంలో రవాణా స్తంభించిపోవడంతో చమురు ధరలు అంతర్జాతీయ స్థాయలో పెరుగుతున్నాయి. ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దాదాపు ఎక్కువ మొత్తంలో రావాణా ఈ మార్గం ద్వారానే జరుగుతోంది. ఈ క్రమంలో ముడి చమురు ధరలపై భారత్లోని అమెరికా రాయబారి సెర్గియా గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలను స్థిరంగా ఉంచడానికి భారత్ కీలక పాత్ర పోషిస్తుందని, భారత్ పాత్ర ప్రశంసనీయమని అన్నారు. అంతర్జాతీయ స్ధాయిలో ధరలను సిర్దంగా ఉంచేందుకు ఇండియా గొప్ప భాగస్వామిగా ఉందని, రష్యా నుంచి భారత్ చమురును కొనుగోళ్లు చేసేందుకు అమెరికా అనుమతి ఇవ్వడం అందులో భాగమేనని అన్నారు. ఈ మేరకు తన ఎక్స్ అకౌంట్లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు.
ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద చమురు వినియోగదారు, ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ఒకటి ఉందని, ముడి చమురు ధరల్లో స్థిరత్వం కోసం భారత్, అమెరికా చేతులు కలిపి పనిచేయడం చాలా అవసమరమని సెర్గియా గోర్ పిలుపునిచ్చారు. అంతకముందు వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కూడా మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఇంధన సరఫరాకు అంతరాయం కలుగుతుందని, అందులో భాగంగానే రష్యా నుంచి చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా అనుమతి ఇచ్చిందన్నారు. స్వల్ప కాలం మాత్రమే పర్మిషన్ ఇచ్చినప్పటికీ.. దీని వల్ల రష్యాకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో దీని గురించి తాను మాట్లాడానని, ట్రెజరీ కార్యదర్శి, జాతీయ భద్రతా బృందంతో చర్చల తర్వాత ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారు. భారత్ తమకు మంచి మిత్రదేశమని, అందుకే చమురు సరఫరాలో అంతరాయం క్రమంలో రష్యా నుంచి కొనుగోలు చేసుకునేందుకు తాత్కాలికంగా అంగీకరించామని పేర్కొన్నారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసుకునేందుకు భారత్కు 30 రోజుల పాటు అమెరికా అనుమతి ఇచ్చింది. అటు హార్ముజ్ జలసంధి ద్వారా ఇంధన సరఫరాను నిరోధించడంలో ఇరాన్ చేసే చర్యను అడ్డుకునేందుకు సిద్దంగా ఉన్నామని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్కు వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ జలసంధిలో మందుపాతరలు ఉంచకుండా ఉండాలని, వాటిని తొలించకపోతే సైనిక పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఏమైనా మందుపాతరలు ఉంటే వాటిని తొలగించాలని, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయన్నారు. మునుపెన్నడూ చూడని స్ధాయలో పరిణామాలు ఉంటాయని, క్షిపణులను ప్రయోగించేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. కాగా ఇరాన్ గల్ప్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లోని అమెరికా స్థావరాలు, రాయబార కార్యాలయాలపై దాడులు చేస్తోంది.

