
Pak Vs Ban : క్రికెట్ ప్రపంచంలో పాకిస్తాన్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మొదటి వన్డేలో పాకిస్తాన్ జట్టు అత్యంత దారుణమైన ప్రదర్శనతో కుప్పకూలిపోయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, బంగ్లా బౌలర్ల ధాటికి కేవలం 30.4 ఓవర్లలోనే 114 పరుగులకే ఆలౌట్ అయింది. వన్డే క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్పై పాకిస్తాన్కు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. దీనికి ముందు 1999లో బంగ్లాపై 161 పరుగులు చేసిన రికార్డు ఉండేది. ఇప్పుడు ఆ 27 ఏళ్ల నాటి చెత్త రికార్డును ప్రస్తుత పాక్ జట్టు తిరగరాసింది.
ఈ మ్యాచ్లో పాకిస్థాన్ మేనేజ్మెంట్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఏకంగా నలుగురు కొత్త ఆటగాళ్లను (డెబ్యూటెంట్స్) బరిలోకి దింపింది. అందులో ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాటర్లు కాగా, ఒకరు మిడిల్ ఆర్డర్ ప్లేయర్. అయితే ఆ నలుగురూ దారుణంగా విఫలమై పాక్ పరువు తీశారు. ఓపెనర్లుగా వచ్చిన సాహిబ్జాదా ఫర్హాన్ 27 పరుగులు చేయగా, మాజ్ సదాకత్ 18 పరుగులకే పరిమితమయ్యాడు. ఇక బాబర్ ఆజం స్థానంలో నంబర్ 3లో బ్యాటింగ్కు వచ్చిన షామిల్ హుస్సేన్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. వీరి ముగ్గురినీ బంగ్లాదేశ్ బౌలర్ నహిద్ రాణా ఒక్కడే వెనక్కి పంపడం విశేషం.
పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ ఎంత ఘోరంగా ఉందంటే, నాలుగో డెబ్యూటెంట్ అబ్దుల్ సమద్ అయితే కనీసం ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఆరు బంతులు ఆడిన అతను డకౌట్గా వెనుదిరిగి తన వన్డే కెరీర్ను నిరాశాజనకంగా ప్రారంభించాడు. జట్టులో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ పార్టనర్ షిప్ కూడా నమోదు కాలేదు. ఓపెనింగ్ వికెట్కు వచ్చిన 41 పరుగులే ఈ ఇన్నింగ్స్లో అత్యధిక భాగస్వామ్యం అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత చివరి వికెట్కు వచ్చిన 32 పరుగులు జట్టును వంద దాటించాయి. బంగ్లా బౌలర్లలో నహిద్ రాణా 5 వికెట్లతో పాక్ వెన్ను విరచగా, మెహదీ హసన్ 3 వికెట్లు తీసి తన వంతు సహకారం అందించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

