టీటీడీకి మరో భారీ విరాళం అందింది. ముంబైకు చెందిన భక్తులు టీటీడీ ట్రస్టులకు రూ.20 లక్షలు విరాళంగా అందించారు. ముంబైకి చెందిన రాజేంద్ర జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లు టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు, స్విమ్స్ ఆస్పత్రికి రూ.10 లక్షలు చొప్పున విరాళం అందించారు. టీటీడీ ఈవో రవిచంద్రను కలిసి విరాళానికి సంబంధించిన డీడీని అందించారు. ఈ సందర్భంగా దాతలను టీటీడీ ఈవో అభినందించారు.

మరోవైపు టీటీడీ ఆధ్వర్యంలో అనేక ట్రస్టులు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఎస్వీ ప్రాణదానం ట్రస్టు, ఎస్వీ అన్నదానం ట్రస్టు, విద్యాదానం ట్రస్టు ఇలాంటి అనేక ట్రస్టులను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. ఈ ట్రస్టుల ద్వారా సేవలు అందిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే ప్రముఖులు.. టీటీడీ సామాజిక సేవా కార్యక్రమాలకు తమ వంతు సాయంగా ఉండేందుకు విరాళాలు సమర్పిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే టీటీడీకి నిత్యం పలువురు దాతలు విరాళాలు సమర్పిస్తూ ఉంటారు.
టీటీడీ విద్యాసంస్థలకు రూ.118 కోట్లు
మరోవైపు 2026–27 ఆర్థిక సంవత్సరానికి గానూ టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల సమగ్ర అభివృద్ధికి రూ.118.89 కోట్ల నిధులు కేటాయించారు. అత్యాధునిక సాంకేతికత, విద్యార్థుల సామర్థ్యాల పెంపు, విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ విద్యా శాఖలో సమగ్ర మార్పులు తీసుకురావాలని తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి శ్రీ ఎస్వీ విద్యాదాన ట్రస్ట్, టిటిడి కలిపి విద్యాసంస్థలను ఆధునీకరించి.. విద్యార్థుల మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రూ.118.89 కోట్లు కేటాయించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీటీడీ విద్యా సంస్థల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ నిధులను కేటాయించారు. వీటితో అదనపు తరగతి గదులు, అదనపు వసతి గదుల నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు.
శ్రీకాళహస్తిని దర్శించుకున్న శృంగేరి పీఠాధిపతి
మరోవైపు జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామిజీ, జగద్గురు మహా సంస్థానం శృంగేరి పీఠం స్వామీజీ శ్రీకాళహస్తిని సందర్శించారు. ఆలయ మొదటి గోపురమైన భిక్షాల గోపురం దగ్గర శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఆలయ ఈవో వెంకటేశులు వారిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం స్వామివారి అభిషేకము, దర్శనం ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత వేద పండితుల ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.


