ఏలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బుట్టాయిగూడెం మండలంలో అంతర్వేదిగూడెంలో కూల్ డ్రింక్ అనుకుని పురుగులమందు తాగి ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అంతర్వేదిగూడెనికి చెందిన ఐదేళ్ల రితిక శ్రీ అనే బాలిక తల్లిదండ్రులు నిత్యం గొడవలు పడుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే బాలిక తల్లి తన భర్తను బెదిరించేందుకు కూల్ డ్రింక్ సీసాలో పురుగులమందు దాచిపెట్టుకుంది. అయితే ఈ విషయం గురించి తెలియని చిన్నారి రితిక శ్రీ.. కూల్ డ్రింక్ అనుకుని దానిని తాగేసింది. దీంతో అపస్మారక స్థితిలోకి చేరుకోగా.. తల్లిదండ్రులు బుట్టాయిగూడెం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది.

ఈ క్రమంలోనే భర్తను భయపెడదామనే ఉద్దేశంతో కుమారి పొగాకు తోటకు చల్లే పురుగులమందును.. కూల్ డ్రింక్ సీసాలో తెచ్చుకుని ఇంటి వద్ద కంచెకు తగిలించింది. అయితే ఐదేళ్ల రితిక.. బాటిల్లో ఉన్నది కూల్ డ్రింక్ అనుకుని పొరబాటుపడి.. మంగళవారం రోజున బాటిల్లో ఉన్న పురుగులమందు తాగేసింది. ఆ తర్వాత చిన్నారి నొప్పితో విలవిల్లాడుతూ ఉండటం గమనించిన రితిక కుటుంబసభ్యులు వెంటనే బుట్టాయిగూడెం ఆస్పత్రికి తరలించారు. బుట్టాయిగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి రితిక శ్రీ.. బుధవారం రోజున ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో చిన్నారి తండ్రి నాగేంద్రబాబు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇంటి నుంచి అదృశ్యమై.. శవమై తేలిన యువకుడు..
ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు నాలుగు రోజుల అనంతరం కాలువలో శవమై తేలిన ఘటన.. ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం యాగర్లపల్లికి చెందిన లక్ష్మణ్ అనే 23 ఏళ్ల యువకుడు.. మార్చి 6న ఇంటి నుంచి వెలుపలికి వచ్చాడు. అయితే ఆ తర్వాత ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు అతని ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని నాచుగుంట వద్ద ఏలూరు కాలువలో అతని శవం మంగళవారం రోజున కనిపించింది. పోలీసులు లక్ష్మణ్ మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


