
పెరుగుతున్న ప్రపంచ చమురు ధరలు, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) తన అత్యవసర చమురు నిల్వల నుంచి భారీగా చమురును విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఐఈఏ చరిత్రలో ఇప్పటివరకు తీసుకున్న అతిపెద్ద అత్యవసర చర్యగా భావిస్తున్నారు. పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఈఏ ప్రకారం, సభ్య దేశాల అత్యవసర నిల్వల నుంచి మొత్తం 400 మిలియన్ బ్యారెళ్ల చమురును మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. గతంలో 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇంధన మార్కెట్ను స్థిరీకరించడానికి 182.7 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేశారు. అయితే ప్రస్తుతం ప్రకటించిన పరిమాణం దానికంటే చాలా ఎక్కువగా ఉంది.
ఈ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ విడుదల చేసిన ప్రకటనలో, ఐఈఏ అసోసియేట్ మెంబర్గా భారతదేశం ఈ నిర్ణయానికి మద్దతు ఇస్తుందని పేర్కొంది. ప్రపంచ చమురు మార్కెట్లలో ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఏర్పడుతున్న పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని కూడా తెలిపింది. ఈ విషయంపై ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ మాట్లాడుతూ చమురు మార్కెట్ ప్రస్తుతం పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, సరఫరా అంతరాయాలు, నిల్వల పరిమితి కారణంగా కొన్ని చమురు ఉత్పత్తిదారులు ఉత్పత్తిని తగ్గించడం ప్రారంభించారని ఆయన తెలిపారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సభ్య దేశాలు అపూర్వ స్థాయిలో సమిష్టి చర్య తీసుకున్నాయని చెప్పారు.
ఈ చమురు విడుదల ప్రతిపాదనను ఐఈఏకు చెందిన 32 సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. జీ7 దేశాలు కూడా ఈ నిర్ణయానికి మద్దతు ప్రకటించాయి. జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పటికే తమ అత్యవసర చమురు నిల్వలను ఉపయోగించేందుకు సిద్ధమయ్యాయి. జపాన్ ప్రభుత్వం మార్చి 16 నుంచి సుమారు 80 మిలియన్ బ్యారెళ్ల ఇంధనాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ చర్యల వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లో సరఫరా–డిమాండ్ సమతుల్యత కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగితే చమురు ధరలపై ఒత్తిడి పూర్తిగా తగ్గకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

