Tirumala Rare Green Cobra: తిరుమలలో అరుదుగా ఉండే పచ్చ నాగుపాము కనిపించింది. మనం బూడిద రంగులో ఉండే నాగుపాముల్ని చూస్తుంటాం. కానీ తిరుమలలో మాత్రంపచ్చ రంగులో ఉన్న నాగుపాము ప్రత్యక్షమైంది. ఈ పామును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సమాచారం అందుకున్న టీటీీడ స్నేక్ క్యాచర్ భాస్కరనాయుడు అక్కడికి చేరుకున్నారు. ఆ పామును జాగ్రత్తగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇలాంటి పచ్చరంగు నాగుపాములు చాలా అరుదుగా ఉంటాయని చెబుతున్నారు.
హైలైట్:
- తిరుమలలో అరుదైన పచ్చ నాగుపాము
- ఆదిశేషు అతిథి గృహం దగ్గర ప్రత్యక్షం
- జాగ్రత్తగా పట్టుకుని అడవిలో వదిలేశారు

అన్నమాచార్య వర్థంతి ఉత్సవాలు
తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో మార్చి 15న పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యల 523వ వర్థంతి మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించనున్నారు. అటు తరువాత స్వామివారు ఉభయదేవేరులతో కలిసి ఆలయానికి వేంచేపు చేస్తారు.
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వర్ధంతి ఉత్సవాలను మార్చి 14 నుండి 21వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుమల నారాయణగిరి ఉద్యానవనం, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం మరియు మహతి కళాక్షేత్రంలో జరుగనున్నాయి. మార్చి 14వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం నిర్వహిస్తారు. మార్చి 15 నుండి 21వ తేదీ వరకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు సాహితీ సదస్సులు, సాయంత్రం భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. తాళ్లపాకలోని ధ్యానమందిరం మరియు 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం వేళ ఆధ్యాత్మిక మరియు భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మార్చి 16 నుండి 18వ తేదీ వరకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు ప్రముఖ కళాకారులతో సంగీత సభలు నిర్వహించనున్నారు.


