హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ శాస్త్రం ప్రకారం జీవితం లో చేసే ప్రతి పనిని నిర్దిష్ట సమయం, దిశ, విధానం ప్రకారం చేయాలని చెబుతారు. ఇలా చేయడం వల్ల శుభఫలితాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. ఇప్పటికీ చాలా మంది శుభకార్యాలు చేయడానికి ముందు వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తున్నారు.
మన రోజువారీ జీవితంలో అత్యంత ముఖ్యమైన పని ఆహారం తీసుకోవడం. ఇది కేవలం శరీరాన్ని పోషించే ప్రక్రియ మాత్రమే కాదు, మన మనసు, ఆత్మపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం భోజనం చేసేటప్పుడు వ్యక్తి కూర్చునే దిశ కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. సరైన దిశలో కూర్చుని భోజనం చేస్తే మానసిక ప్రశాంతత, ఆరోగ్యం మెరుగవుతాయని నమ్మకం ఉంది. అయితే కొన్ని దిశల్లో కూర్చుని భోజనం చేయడం మంచిది కాదని కూడా చెబుతారు.
దిక్కులు, వాటి దేవతలు..
వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి దిశకు ఒక దేవత ఆధిపత్యం ఉంటుంది.
తూర్పు దిశ – ఇంద్రుడు
పడమర దిశ – వరుణుడు
ఉత్తర దిశ – కుభేరుడు
దక్షిణ దిశ – యముడు
ఈశాన్యం – ఈశ్వరుడు
ఆగ్నేయం – అగ్నిదేవుడు
వాయువ్యం – వాయుదేవుడు
నైరుతి – రాక్షసులు నివాసం ఉంటారని చెబుతారు.
తూర్పు దిశలో కూర్చుని భోజనం చేస్తే..
వాస్తు ప్రకారం తూర్పు దిశలో కూర్చుని భోజనం చేయడం ఉత్తమంగా భావిస్తారు. ఈ దిశ సూర్యుడి శక్తి, ఆరోగ్యం, సానుకూలతను సూచిస్తుంది. తూర్పు వైపు చూసి భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుందని చెబుతారు.
ఉత్తర దిశలో కూర్చుని భోజనం చేస్తే..
ఉత్తర దిశలో కూర్చుని తినడం వల్ల సంపద, శ్రేయస్సు పెరుగుతాయని నమ్మకం ఉంది. ఈ దిశ కుభేరుని దిశగా భావించబడుతుంది. కుటుంబంలో ఆనందం, శాంతి పెరుగుతాయని కూడా చెబుతారు. వ్యాపారులు, విద్యార్థులు, మానసిక పనులు చేసే వారికి ఈ దిశ మంచిదిగా భావిస్తారు.
పశ్చిమ దిశలో కూర్చుని భోజనం చేస్తే..
పశ్చిమ దిశలో కూర్చుని భోజనం చేయడం కూడా కొంతమేరకు అనుకూలంగా భావిస్తారు. ఈ దిశలో కూర్చుని తినడం వల్ల ధన సంబంధ సమస్యలు తగ్గుతాయని, ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతారు. నేలపై కూర్చుని భోజనం చేసే వారికి అన్నపూర్ణ దేవి ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం ఉంది.
భోజనం చేసే ముందు పాటించాల్సిన నియమాలు..
వాస్తు శాస్త్రం ప్రకారం భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం మంచిది.
భోజనం ముందు చేతులు, కాళ్లు, నోరు శుభ్రం చేసుకోవాలి.
ప్రశాంత వాతావరణంలో ఏకాగ్రతతో భోజనం చేయాలి.
తినేటప్పుడు టీవీ, మొబైల్ లేదా ఇతర దృష్టి చెదరగొట్టే వాటికి దూరంగా ఉండాలి.
భోజనం ముందు దేవుడిని స్మరించి ఆహారాన్ని ప్రసాదంగా భావించాలి.
నిటారుగా కూర్చుని భోజనం చేయాలి. పడుకు తినడం మంచిది కాదు.
భోజనం తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.
ఈ విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం భోజనం చేసే సమయంలో కొన్ని నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యం, ఆనందం, ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందవచ్చని నమ్ముతారు.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)








