Vijayawada Olx Case Ajith Kumar Sims Update: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పోలీసులు ఇటీవల అజిత్కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతడు ఓఎల్ఎక్స్, గ్రానైట్ వ్యాపారం పేరుతో మోసాలకు పాల్పడ్డాడు. అతడిపై ఏకంగా 32 కేసులు ఉన్నాయి. అయితే నిందితుడు అజిత్ కుమార్ మోసాలకు పాల్పడేందుకు సిమ్లను భారీగా కొనుగోలు చేశారు. ఒక్కో సిమ్ను ఏకంగా రూ.1500 పెట్టి మరీ కొనుగోలు చేసినట్లు తేలింది.
హైలైట్:
- విజయవాడలో అజిత్కుమార్ అరెస్ట్
- ఓఎల్ఎక్స్, గ్రానైట్ పేరుతో మోసాలు
- ఒక్కో సిమ్ రూ.1500తో కొనుగోలు

అజిత్కుమార్పై ఒక్క ఓఎల్ఎక్స్కు సంబంధించి 12 కేసులు నమోదయ్యాయి. మిగిలినవి గ్రానైట్ వ్యాపారం పేరుతో చేసిన మోసాలకు సంబంధించినవి. అజిత్కుమార్ ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీసాయి గ్రానైట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పేరుతో వ్యాపారం ప్రారంభిచానని చెప్పాడు. గ్రానైట్ వ్యాపారం చేస్తున్నట్లు చెప్పి సరుకు తీసుకునేవాడు.. కానీ ఆ తర్వాత డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టేవాడు. కొంతమంది దగ్గర గ్రానైట్ పంపిస్తానని చెప్పి అడ్వాన్సులు తీసుకుని మోసం చేసేవాడు. అక్కడ చాలామందిని మోసం చేసి తిరిగి ఏలూరు జిల్లాలోని సొంత ఊరికి వెళ్లాడు. అతడిపై ప్రకాశం జిల్లాలో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఓఎల్ఎక్స్ మోసాలకు పాల్పడ్డాడు. ఇలా మోసాలు చేసి సంపాదించిన డబ్బులతో లగ్జరీ లైఫ్ గడిపేవాడు. ఈ డబ్బుల్ని ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, క్యాసినోలకు ఖర్చు చేశాడు.
అజిత్కుమార్ కార్ల డీలర్గా నటిస్తూ OLX ప్లాట్ఫారమ్లో కార్ల కొనుగోలు–అమ్మకాల పేరుతో మోసం చేశాడు. అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా డబ్బు తీసుకుని బంగారం కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో నగదుగా మార్చుకునేవాడు. పోలీసులు నిందితుడి దగ్గర నుంచి సుమారు రూ.50 లక్షల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో కొనుగోలు/అమ్మకాలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులతో డబ్బు లావాదేవీలు చేయకూడదని పోలీసులు సూచించారు.


