Amaravati Bits Pilani campus plans: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ బిట్స్ పిలానీ క్యాంపస్ నిర్మాణ ప్లాన్లు పరిశీలించారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ఎదుట నిర్మాణ ప్లాన్లు ప్రదర్శించారు బిట్స్ ప్రతినిధులు. ఈ నేపథ్యంలో నిర్మాణ ప్లాన్లపై సంతృప్తి వ్యక్తం చేశారు నారా లోకేష్. వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

అమరావతి క్యాంపస్ ద్వారా రెండు దశలలో ఏడువేల మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా నిర్మాణాలు చేపడుతున్నట్లు బిట్స్ పిలానీ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో అమరావతి బిట్స్పిలానీ క్యాంపస్ మీద రూ.1000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించారు. నెక్ట్స్ జెన్ టెక్నాలజీలతో క్యాంపస్ నిర్మిస్తున్నామని.. ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు నారా లోకేష్కు వివరించారు. గ్రీన్ బిల్డింగ్, రెన్యువబుల్ ఎనర్జీ వంటి పర్యావరణహిత విధానాలను క్యాంపస్ నిర్మాణంలో అనుసరిస్తున్నట్లు తెలిపారు. అమరావతి బిట్స్పిలానీ క్యాంపస్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్గా ఉంటుందని వెల్లడించారు.
అగ్రికల్చర్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వంటి కోర్సులు అమరావతి బిట్స్ క్యాంపస్లో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్కు బిట్స్ పిలానీ ప్రతినిధులు వివరించారు. నిర్మాణ ప్లాన్లపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్.. సాధ్యమైనంత త్వరగా అమరావతి క్యాంపస్ ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు.
అమరావతిలో అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి భూమిపూజ
మరోవైపు అమరావతిలో అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు.అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లోని నేలపాడులో 50 సెంట్ల స్థలంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. దీని నిర్మాణానికి శుక్రవారం రోజు ఉదయం ఫైర్ సర్వీసెస్ డీ.జీ. పీ.వీ.రమణ చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.
రూ.1.28 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అమరావతిలో అగ్నిమాపక కేంద్రం నిర్మించనుంది. నేలపాడులో ఏర్పాటు కానున్న ఈ అగ్నిమాపక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.


