
గాడిదలు, ఒంటెలు, గుర్రాలు పెంచుకుంటే.. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.50 లక్షలను పొందవచ్చు. వీటి పంపకాన్ని ప్రోత్సహించడం, నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. రెండు విడతలుగా కేంద్రం సాయం అందిస్తోంది. అలాగే బ్యాంక్ నుంచి రుణాలు కూడా వచ్చేలా కూడా భరోసా కల్పిస్తోంది. ఈ జంతువుల సంఖ్య తక్కువగా ఉన్న సమయంలో వీటిని పెంచేందుకు కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఆర్ధిక సాయం అందించడం ద్వారా పెంచేవారు ముందుకొస్తారని, దీని వల్ల ఉపాధి కూడా కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. అసలు కేంద్రం నుంచి సాయం పొందేందుకు అర్హతలు ఏంటి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే విషయాలు చూద్దాం.
అర్హతలు ఇవే..
జాతీయ పశువుల మిషన్ పథకాన్ని తాజాగా కేంద్రం ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా గాడిదలతో పాటు గుర్రాలు, ఒంటెలు పెంచుకుని ఆదాయం పొందాలనుకునేవారి కోసం కేంద్రం రూ.50 లక్షల వరకు సాయం అందిస్తోంది. ఉదాహరణకు మీరు వీటి పెంపకానికి రూ.కోటి వరకు ఖర్చు చేస్తుంటే కేంద్రం 50 శాతం సబ్సిడీ అందిస్తోంది. అంటే మీరు రూ.50 లక్షల సబ్సిడీ పొందవచ్చు. అంటే సగానికి సగం ఖర్చు కేంద్రం నుంచి అందుకోవచ్చు. దేశంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుతం 1.23 లక్షల గాడిదలు మాత్రమే ఉన్నాయి. ఇక 2012 నుంచి వీటి సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. దీంతో గాడిదలతో పాటు మిగతా పశు సంపదను పెంచేందుకు కేంద్రం పెంచేవారికి ప్రోత్సాహకం అందించాలని నిర్ణయించింది.
అర్హతలు ఇవే..
ఒక యూనిట్లో కనీసం 50 ఆడ గాడిదలు, 5 మగ గాడిదలు ఉండాలి. దేశీయ రకానికి చెందిన జాతుల గాడిదలకు మాత్రమే సబ్సిడీ అందిస్తారు. విదేశీ జాతులు పెంచుకుంటే సాయం అందదు. రెండు విడతలుగా ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తోంది. బ్యాంక్ నుంచి లోన్ మంజూరైన తర్వాత తొలి విడత సొమ్ము నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు. ఇక ఏర్పాటు చేసుకున్న తర్వాత రెండో విడత నగదు విడుదల చేస్తారు. మీకు అయ్యే ఖర్చులో 50 శాతంను సబ్సిడీగా కింద అందిస్తారు.
దరఖాస్తు ఎలా..?
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. https://nlm.udyamimitra.in/Home/SchemePage వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అధికారులు మీ వివరాలను పరిశీలించి ఆర్ధిక సాయం అందిస్తారు. ఎవరైనా ఈ పథకం ద్వారా గాడిదలను పెంచేందుకు సహాయం పొందవచ్చు.

