పిఠాపురం రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. టీడీపీ ఇంఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కోపంతో పిఠాపురం పాలిటిక్స్లో హీట్ పెరిగింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో చిన్నదిగా వేశారంటూ ఎస్వీఎస్ఎన్ వర్మ అధికారులపై కోప్పడ్డారు. సమావేశంలో మాట్లాడకుండా కూర్చుకున్నారు. అనంతరం టీడీపీ నేతలతో అక్కడి నుంచి వాకౌట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబుకే గౌరవం లేకపోతే తామెందుకు అంటూ కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు వర్మ.

చంద్రబాబు ఫోటో స్టాంప్ సైజులో ఉండటంతో కార్యక్రమానికి హాజరైన టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. చంద్రబాబు ఫోటో చిన్నదిగా ఉంటే ఎలా మాట్లాడతారంటూ ఎస్వీఎస్ఎన్ వర్మకు సూచించారు. దీంతో వేదికపై నుంచి కిందకు దిగిన వర్మ.. వేదిక ముందు కూర్చున్నారు. ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో చిన్నదిగా ఉండటంపై స్థానిక మున్సిపల్ అధికారులపై వర్మ కోపగించుకున్నారు. అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అనుచరులతో కలిసి సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఇదే సమయంలో స్థానిక టీడీపీ కౌన్సిలర్లపైనా ఎస్వీఎస్ఎన్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో చిన్నదిగా వేస్తే మీరేం చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబుకే గౌరవం లేనప్పుడు తామెందుకు ఇక్కడ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఇంత జరుగుతున్నా వేదికపై ఉన్న జనసేన నేతలు స్పందించకపోవటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికితోడు అధికారులతో మాట్లాడే సమయంలో ఇదంతా ఎవరు చేస్తున్నారో తనకు తెలుసంటూ ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొనడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తు కారణంగా పిఠాపురం సీటు పవన్ కళ్యాణ్కు కేటాయించారు. దీంతో ఎస్వీఎస్ఎన్ వర్మ తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఏపీలో అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చంద్రబాబు పిఠాపురం వర్మకు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ ఆ దిశగా అడుగులు పడలేదు.
మరోవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేశారు ఎస్వీఎస్ఎన్ వర్మ. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన పిఠాపురంలో జనసేన, టీడీపీ నేతల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. అనేకసార్లు ఈ విషయం బహిరంగంగానే వ్యక్తమైంది. దీంతో పవన్ కళ్యాణ్ లేకుండా సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎస్వీఎస్ఎన్ వర్మ.


