ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదల చేశారు. పీఎం కిసాన్ యోజనతో కలిసి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.4000 , కేంద్రం వాటా రూ.2000 కలిపి.. మొత్తం ఆరు వేలు విడుదల చేశారు. స్టేటస్ ఎలా చెక్ చేయాలో ఇక్కడ చూద్దాం.

ఈ ఏడాది మొత్తం రూ.8,985 కోట్లు రైతులకు ఇచ్చినట్లు తెలిపారు.
మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో.. రైతులు తమ బ్యాంక్ ఖాతాలలో డబ్బులు పడ్డాయా లేదా.. ఏ బ్యాంకులో పడ్డాయనే సంగతిని స్టేటస్ చెక్ చేయటం ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం https://annadathasukhibhava.ap.gov.in/ వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది. వెబ్సైట్ ఓపెన్ చేయగానే.. హోం స్ర్కీన్ మీద.. Know Your Status అనే ఆప్షన్ ఉంటుంది. దానిని ఎంచుకోవాలి. ఆ తర్వాత రైతులు తమ ఆధార్ కార్డు నంబర్ వివరాలను నమోదు చేయాలి.
ఆధార్ కార్డు నంబరుతో పాటుగా, కాప్చా ఎంటర్ చేసిన అనంతరంసెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి. దీంతో రైతుల వివరాలు కనిపిస్తాయి. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులై ఉంటే.. సదరు రైతు పేరుతో పాటుగా.. జిల్లా, మండలం, గ్రామం వంటి వివరాలు కనిపిస్తాయి. పథకం స్టేటస్కి సంబంధించిన సమాచారం ఉంటుంది. అలాగే డబ్బులు ఏ బ్యాంక్ అకౌంట్లోకి పడ్డాయనే వివరాలను సైతం తెలుసుకోవచ్చు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో కేంద్రం వాటా ఆరు వేల రూపాయలు కాగా.. రాష్ట్రం వాటా రూ.14000. ఇందులో తొలివిడత కింద ఏడు వేల రూపాయలు , రెండో విడత కింద మరో ఏడువేల రూపాయలు.. మూడో విడత కింద ఆరు వేల రూపాయలను అర్హులైన రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది.


