అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కృతం అయింది. 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని తాజాగా సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఇక ఈ విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పేరు పెట్టారు. కేవలం ఆరు నెలల్లోనే ఈ విగ్రహాన్ని నిర్మించారు. మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను కూడా అక్కడ నిర్మించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తుళ్లూరు సమీపంలోని శాఖమూరులో 6.8 ఎకరాల్లో నిర్మించిన ఈ స్మృతివనంలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఆర్యవైశ్య సంఘాలు, ట్రస్ట్ ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం కోసం 26 టన్నుల కాంస్యం.. 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ను ఉపయోగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని.. కేవలం 6 నెలల్లోనే మొదటి దశ పనులను పూర్తి చేయడం గమనార్హం.
ఇక తొలి విడతలో పొట్టి శ్రీరాములు స్మృతివనం అభివృద్ధి చేసి కేవలం విగ్రహాన్ని నిర్మించడం మాత్రమే కాకుండా.. రెండో దశలో ఇంకొన్న వసతులు కల్పించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగానే.. ఈ పొట్టి శ్రీరాములు స్మృతివనంలో అత్యాధునిక మ్యూజియంతోపాటు.. ఆడిటోరియం, యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రాన్ని సాధించడం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ.. రాబోయే తరాలకు కూడా ఆయన ఆశయాలను చాటిచెప్పేలా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.
పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని.. సీఎం చంద్రబాబు కొనియాడారు. పొట్టి శ్రీరాములు గౌరవార్థం రాజధాని ఈ భారీ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించడం ఏపీ ప్రజలందరికీ గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, నారాయణ, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, సవితలతో పాటు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. బీజేపీ నేత మాధవ్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ హాజరయ్యారు.


