ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే తొలి విడతలో 11 వేల 400 ఇండక్షన్ స్టవ్లు పంపిణీ చేయగా.. మిగిలిన 44 వేల 346 ఇండక్షన్ స్టవ్లను అంగన్వాడీ కేంద్రాలకు వీలైనంత త్వరగా అందించాలని ఏపీ ప్రభుత్వం ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ను ఆదేశించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఇబ్బందులు నెలకొన్న నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ఇబ్బందులు రాకుండా ఈ చర్యలు చేపట్టింది.

అందులో భాగంగా తొలి విడతగా ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) 11,400 ఇండక్షన్ స్టవ్లను ఇప్పటికే సరఫరా చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో EESL ఇప్పుడు మిగిలిన 44,346 ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేయడం ప్రారంభించింది. దీంతో రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు చేరతాయని అధికారులు చెప్తున్నారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో.. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు ఆమోదించారని ముఖ్యమంత్రి కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న తెలిపారు.
మరోవైపు వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కారణంగా తెలుగు రాష్ట్రాలలో హోటళ్ల వ్యాపారులు, హాస్టల్స్ నిర్వాహకులు, క్యాటరింగ్ పరిశ్రమల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ఆతిథ్య రంగంపై ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత ప్రభావం ఉంది. అయితే ఈ ప్రభావం అంగన్వాడీ కేంద్రాలపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ల పంపిణీ వేగవంతం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం పౌష్టికాహారం పంపిణీ చేస్తోంది. గ్యాస్ కొరత కారణంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మరోవైపు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ఇప్పటికే కొన్నిచోట్ల హోటళ్లు మూసివేస్తున్నారు. మరికొంతమంది నిర్వాహకులు టిఫిన్ రేట్లు పెంచారు. ఇంకొంతమంది కట్టెలపొయ్యి వంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నారు. గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్యాస్ బుకింగ్లు పెరగడమే కాకుండా.. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, ఇండక్షన్ స్టవ్ వంటి ఎలక్ట్రిక్ పరికరాలకు డిమాండ్ పెరిగింది.


