Tirumala June 2026 Darshan Quota Schedule: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది. జూన్ నెలకు సంబంధించి టీటీడీ దర్శనాలు, గదులు ఆన్లైన్ కోటా షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి కోటాను విడుదల చేశారు. భక్తులు జూన్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, గదుల్ని బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. భక్తులు టీటీడీ వెబ్సైట్ ద్వారా ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
హైలైట్:
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- జూన్ నెల కోటా షెడ్యూల్ వచ్చింది
- ఈ నెల 18 నుంచి బుకింగ్స్ ప్రారంభం

మరోవైపు ఈ నెల 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్లను టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది. ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయనుంది. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది టీటీడీ.
ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి.. శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. సోమవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, సహస్రనామార్చన చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు వేద ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మేదినీపూజ, మృత్సంగ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి,ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఆలయ ప్రధాన అర్చకులు ఏపీ ఆనందకుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవాళ ఉదయం 8 నుండి 9 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 6.30 నుండి 8 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.


