AP Govt 90% Subsidy For Drip Irrigation: ఏపీ ప్రభుత్వం ఎఫ్ఆర్ఏ పట్టాదారులకు భారీగా రాయితీలు ప్రకటించింది. 100శాతం రాయితీపై సూక్ష్మ సేద్యం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే తుంపర సేద్యానికి అవసరమైన పరికరాలను 90శాతం రాయితీపై అందిస్తోంది. రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో 2.26 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. ఎఫ్ఆర్ఏ పట్టాలు ఉండి ఈ పథకానికి అర్హులైనవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
హైలైట్:
- ఏపీలో ఎఫ్ఆర్ఏ పట్టదాారులకు భారీగా రాయితీలు
- 100శాతం రాయితీపై సూక్ష్మ సేద్యం అమలు
- 90% రాయితీతో తుంపర సేద్యానికి పరికరాలు

రాష్ట్రంలో మొత్తం 2.26 లక్షల మంది ఎఫ్ఆర్ఏ పట్టాదారులకు లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో ఎఫ్ఆర్ఏ పట్టదారులకు బిందు, తుంపర సేద్యం పరికరాలు అందిస్తారు. ధాత్రి అబా జన్జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ కింద ఈ పరికరాలను సమకూర్చనున్నారు. సూక్ష్మసేద్యానికి ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన పథకం కింద చిన్న, సన్నకారు రైతులైతే 55%, పెద్ద రైతులైతే 45% రాయితీ పథకం అమలు చేస్తున్నారు. కేంద్రం నుంచి 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి 40% చొప్పున భరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఏపీప్రభుత్వం 100శాతం రాయితీ ఇస్తోంది. అదే మిగిలిన చిన్న, సన్నకారు రైతులకు 90% రాయితీ అమలు చేస్తోంది. అదే పెద్ద రైతులు ఉంటే 70శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కేంద్రం రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని భరిస్తోంది. అయితే తాజాగా కేంద్రం ఎఫ్ఆర్ఏ పట్టాదారులకు కేంద్రం 100% రాయితీ భరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం తుంపర సేద్య పరికరాలపై 50% రాయితీ అందిస్తుండగా.. ఇప్పుడు కేంద్రం ఎఫ్ఆర్ఏ పట్టాదారులకు ఏకంగా 90% చొప్పున రాయితీ అందించనుంది.
అర్హత ఉన్న ఎఫ్ఆర్ఏ (అటవీ హక్కుల చట్టం-ఫారెస్ట్ రైట్స్ యాక్ట్) పట్టాదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 100% రాయితీపై సూక్ష్మసేద్యం చేసుకునే అవకాశం వచ్చింది. ఇటు తుంపర సేద్య పరికరాలపై 90% రాయితీ ఇస్తారు. అయితే ఎనిమిది జిల్లాల్లోని ప్రజలకు మాత్రమే ఈ రాయితీ దక్కుతుంది. ఈ రాయితీలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం వ్యవసాయశాఖ అధికారుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.


