సొంతూరిలో పాఠశాల నిర్మాణం కోసం కాటూరి మెడికల్ కళాశాల అధినేత కాటూరి సుబ్బారావు కోటి రూపాయలు విరాళంగా అందించారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని కొండపాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాల నిర్మాణం కోసం కోటి రూపాయలు అందించారు. ఈ మేరకు బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా కాటూరి సుబ్బారావును ఊరిజనం అభినందించారు. ఈ నగదుతో స్కూలు భవనాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మించనున్నారు.

కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్.. గుంటూరులోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్. గుంటూరుకు 15 కిలోమీటర్ల దూరంలో గుంటూరుకు నైరుతి దిశలో చిలకలూరిపేట వైపు ఉంది. ఈ కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు బోధిస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అనుబంధంగా ఈ కాలేజ్ ఉంది. మరోవైపు కాలేజీ అధినేత కాటూరి సుబ్బారావు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈ క్రమంలోనే సొంతూరిలోని విద్యార్థుల కోసం, వారి చదువుల కోసం నూతన పాఠశాల భవనాల నిర్మాణం కోసం ఈ మొత్తం విరాళంగా అందించారు. దీనిపై గ్రామస్థుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో ఓ పథకాన్ని అమలు చేస్తోంది. పీ4 పేరుతో ఈ కార్యక్రమం అమలు చేస్తోంది. సంపన్న వర్గాలు.. నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుని వారి అభ్యున్నతికి తోడ్పాటు అందించటమే పీ4 కార్యక్రమం ఉద్దేశం. పీ4 కార్యక్రమంలో దత్తత తీసుకునే వారిని మార్గదర్శులని.. పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా అభివర్ణిస్తారు. పేద ప్రజలకు విద్య, ఉపాధితో పాటుగా జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ పథకం ఉద్దేశం. మార్గదర్శులు, బంగారు కుటుంబాల మధ్యన వారధిగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ పథకం కింద ఇప్పటికే పలు కుటుంబాలను దత్తత తీసుకున్నారు.


